Telangana: క్రైమ్ సీన్లో క్లూస్ సెర్చింగ్ అనుకునేరు.. అక్కడ కనిపించినవి చూసి కళ్లు తేలేశారు
వరంగల్ జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. భార్యభర్తల కలహాల నేపధ్యంలో పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయిన ఓ మహిళ ఫోటోతో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. ఆ పూజలు చూసి షాకైన మహిళ తన భర్త, అత్త కలిసి తనను హతమార్చడం కోసం ఫోటోతో చేతబడి చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విచిత్ర సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో జరిగింది. మహిళ ఫోటోతో క్షుద్రపూజలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. గ్రామ శివారులోని ప్రసిద్ధ కంఠమహేశ్వర స్వామి దేవాలయం సమీపంలో మర్రిచెట్టు కింద ఈ పూజలు నిర్వహించినట్లు గుర్తించారు.. ఘటనా స్థలంలో తెల్లటి వస్త్రంతో కట్టినబొమ్మ, పసుపు, కుంకుమలు చల్లిన అన్నం ముద్దలు, నిమ్మకాయలు, ఇతర క్షుద్రపూజల సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మహిళ ఫోటోతో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఉన్నాయి. కవిత అనే మహిళకు చెందిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఉపయోగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫోటోపై కుంకుమ చల్లి పూజలు చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇది చదవండి: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని రోజుల వరకు పూజలు చేయకూడదంటే.?
అయితే తన ఫోటోతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడంపై బాధితురాలు కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తనకు ప్రాణహాని తలపెట్టే ఉద్దేశంతోనే ఈ పని చేశారని ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా తన భర్తతో కవితకు కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పుట్టింట్లో ఉంటూ ప్రయివేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తోంది. తన భర్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని సదరు మహిళ ఆరోపిస్తోంది. తనను హతమార్చాలనే దురుద్దేశంతో ఫోటోతో చేతబడి చేసి ఉంటారని ఆరోపిస్తున్న మహిళ.. తనకు ఎలాంటి హాని జరిగినా తన భర్త, అత్తే బాధ్యత వహించాలని ఆరోపిస్తోంది. అయితే మూఢనమ్మకాలతో ఫోటోకు క్షుద్రపూజలు నిర్వహించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్షుద్రపూజల భయంతో ఊరంతా వణికిపోతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అక్కడ లభించిన ఆధారాలను బట్టి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
ఇది చదవండి: ఇలా చేస్తే దోసెలు పెనానికి జన్మలో కూడా అతుక్కోవు.. ఎలాగో మీరూ చూడండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
