రైతన్నలకు అలర్ట్.. వర్షాలు పడే ముందు ఇలా చేస్తే భూసారం అమాంతం పెరుగుతుంది..
రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్కు రైతులు సిద్ధమవుతున్న వేళ, భూసారాన్ని పెంచేందుకు సహజ పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేల బలహీనపడి పంటలు తెగుళ్లకు గురవుతున్నాయని చెబుతున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, జీవామృతం, ఘనజీవామృతం వంటి సేంద్రియ పద్ధతులు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొంటున్నారు.

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. ఇప్పటికే కేరళకు తాకిన రుతుపవనాలు.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయి.. అయితే.. వర్షాలు పడగానే, రైతులు పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే.. సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో భూసారం పెంచడానికి సహజ పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాస్ట్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. గత యాభై సంవత్సరాల క్రితం ఏ పంట వేసినా తెగుళ్లు పెద్దగా లేవని, నేడు అవి పెరగడానికి మనం భూమిని బలహీనపరుచుకోవడమే ప్రధాన కారణమని ప్రకృతి వ్యవసాయ నిపుణులు వివరిస్తున్నారు. సృష్టిలో సహజసిద్ధమైన జీవవైవిధ్యం, ఒక జీవిని మరొక జీవి నియంత్రించే వ్యవస్థ పాడైపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి..విపరీతమైన రసాయనాలు, పురుగుమందులు వాడటం వల్ల మొక్కలు బలహీనపడి, రోగాలకు, వైరస్లకు బలం పెరిగిందని.. అంతేకాకుండా.. భూసారం కూడా తగ్గుతుందని బలం కోల్పోతుందని పేర్కొంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఖరీప్ సీజన్ మొదలవ్వడానికి ముందు.. మొట్టమొదటగా భూమిని సారవంతం చేసుకుంటే, ఆ సారవంతమైన భూమిలో పండిన ఏ పంటకైనా దానిని రక్షించుకునే వ్యవస్థ ఏర్పడుతుందని, జీవవైవిధ్యం దెబ్బతినకుండా ఉంటుందని చెబుతున్నారు. భూమిని సారవంతం చేసుకుంటూ వెళ్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, దీనిద్వారా పంటల నాణ్యతను పెంచుకోవడంతోపాటు.. అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ విధానాలను అనుసరించడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
భూమిని సారవంతం చేసే సహజమైన పద్ధతులు:
సేంద్రియ ఎరువులు: పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది, భూమి గుల్లబారి సారవంతం అవుతుంది.
పచ్చిరొట్ట ఎరువులు: జీలుగ, పిల్లిపెసర, జనుము వంటి పంటలను పూత దశకు ముందు భూమిలో కలియదున్నడం వల్ల భూమికి నత్రజని అందుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగా దీనిని ప్లాన్ చేసుకుంటే.. చాలా మంచిది.. భూమికి బలం వస్తుంది.
సహజ పద్ధతులు -ప్రకృతి వ్యవసాయం: జీవామృతం, ఘనజీవామృతం, కలుపును ఎరువుగా మార్చే పద్ధతులను ఉపయోగించడం ద్వారా నేల కోల్పోయిన సారాన్ని తిరిగి పొందవచ్చు..
పంటల మార్పిడి: ఒకే పంటను అంటే మిర్చి.. పత్తి వంటి పంటలను పదే పదే వేయకుండా.. వేరుశెనగ, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి పంటలను మార్చి మార్చి పండించడం వల్ల భూసారం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా.. నేల సారాన్ని పెంచి.. అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
