పండ్లు తిన్న వెంటనే ఇలా అస్సలు చేయకండి.. ఎందుకో తెలుసా..?
పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని పండ్లను తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణవ్యవస్థకు హానికరం. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కావున తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.

పండ్లు ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమైనవో అందరికీ తెలిసిందే. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని రకాల పండ్లను తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
అరటిపండు పోషక విలువలు అధికంగా ఉండే పండు. ఇందులో కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి. కానీ అరటి పండు తిన్న తర్వాత చల్లటి నీరు తాగితే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అరటి స్వభావం వేడి కాబట్టి నీరు చల్లదనం కలిగిస్తే రెండు వేరు స్వభావాలు కలిసిపోతాయి. ఈ మిశ్రమం వల్ల పొట్టలో గ్యాస్, అజీర్ణం, మంట వంటి సమస్యలు ఎదురవుతాయి.
పుచ్చకాయ వేసవిలో శరీరానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. ఇందులో 90 శాతం నీరే ఉంటుంది. అయితే పుచ్చకాయలో సహజంగా ఉండే ఫ్రక్టోజ్ అనే చక్కెర అధికంగా ఉంటుంది. ఈ పండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇది మంట, మలబద్ధకం, వికారం వంటి సమస్యలకు దారి తీస్తుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది.. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగితే ఫైబర్ నీటిని పీల్చుకుని జీర్ణక్రియకు ఆటంకం కలిగించవచ్చు. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడడానికి దారితీయవచ్చు. అంతేకాకుండా కొంతమంది వ్యక్తుల్లో ఈ కలయిక అలెర్జీ లక్షణాలను కూడా ప్రేరేపించవచ్చని గమనించాలి.
దానిమ్మ పండు రుచికరమైనది మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఐరన్, యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. అయితే దానిమ్మ గింజలు తిన్న వెంటనే నీరు తాగితే ఆహార పదార్థాలు శరీరంలో ఎక్కువసేపు నిల్వ ఉండటానికి అవకాశం ఉంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. కొందరిలో కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
ఏ పండును అయినా సరే తిన్న తరువాత వెంటనే కాకుండా కనీసం అరగంటపాటు నీరు తాగకుండా ఉండటం మంచిది. దీనివల్ల ఆ పండుకి సంబంధించి పోషకాలు శరీరంలో సరిగా జీర్ణమవుతాయి. ఒక్కో పండు స్వభావాన్ని బట్టి తినే విధానాన్ని మార్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు నివారించవచ్చు. పండ్లు సరైన సమయంలో సరైన విధంగా తీసుకుంటే వాటి పోషకాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.