Rana Daggubati: బీపీ చెక్ చేస్తే 220/190.. రానా బ్లడ్ ప్రెజర్ చూసి డాక్టర్లే స్టన్
‘బాహుబలి’లో భల్లాల దేవ పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు రానా దగ్గుబాటి. అన్నింటి కన్నా ఆరోగ్యం ముఖ్యమని ఆయన ఇప్పుడు అందరికీ చెబుతున్నారు. ఎందుకంటే రానా తన జీవితంలో పెను ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నారు. ఆ డీటేల్స్ ఈ కథనంలో..

నటుడు, నిర్మాత రానా.. తెలుగునాట మాత్రమే కాదు దేశమంతటా పాపులర్. భాషాబేధం లేకుండా మంచి రోల్స్ వస్తే చాలు.. ఏ భాషలో అయినా నటిస్తాడు దగ్గుబాటివారబ్బాయి. అయితే రానా రియల్ లైఫ్ ఫైటర్. అతనికి ఒకప్పుడు కుడి కన్ను చూపు పూర్తిగా కనిపించదు. తన కుడి కంటికి చూపు లేదని, దాని ద్వారా తాను చూడలేనని ఆయనే ఓ సందర్భంలో తెలిపారు. ఇది చాలామందికి తెలియదని, తనది డోనర్ కన్ను అని వివరించారు. ఎవరో మరణించిన తర్వాత వారి కంటిని తనకు దానం చేశారని రానా చెప్పుకొచ్చాడు. చిన్నతనంలోనే తనకు LV ప్రసాద్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరిగిందని గుర్తు చేసుకున్నారు.
నటుడు రానా దగ్గుబాటి కంటి సమస్య గురించి డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరంగా వెల్లడించారు. రానాకు కెరటోకోనస్ అనే అరుదైన కండిషన్ ఉందని, దీనివల్ల కనుగుడ్డులోని నల్లగుడ్డుపై ఉన్న పొర గుండ్రంగా ఉండకుండా శంకువు ఆకారంలోకి (conical) మారుతుందని వివరించారు. ఈ కండిషన్ కొన్ని కుటుంబాలలో పుట్టుకతోనే వస్తుందని, తాను రానాకు చికిత్స చేసి దృష్టిని మెరుగుపరిచానని చెప్పారు. రానా ఈ సమస్య గురించి మేము సైతం కార్యక్రమంలో బహిరంగంగా మాట్లాడటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని, అందుకే ఆయన్ను రియల్ టైం హీరో అని ప్రశంసించారు. రానాకు కంటిచూపుకు ఇప్పుడు ఎటువంటి సమస్య లేదని, కాంటాక్ట్ లెన్స్ ధరించడం ద్వారా స్పష్టంగా చూడగలుగుతున్నారని తెలిపారు.
రానా దగ్గుబాటి తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ఆరోగ్య సవాలును సామ్ జామ్ టాక్ షోలో పంచుకున్నారు. 2018లో జరిగిన ఈ సంఘటన తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒక సాధారణ కంటి సర్జరీ కోసం వెళ్లినప్పుడు, అనూహ్యంగా తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తీరు, దాని పర్యవసానాలు రానా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. 2018లో ఒక కుటుంబ విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత, రానా ఒక చిన్న కంటి సర్జరీ (లేసిక్) చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకమైన లెన్స్ ధరించాల్సి రావడం వల్ల ఈ సర్జరీ అవసరమైంది. అయితే, ఆ సర్జరీకి ముందు జరిపిన సాధారణ ఆరోగ్య పరీక్షలలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. డాక్టర్లు ఆయన రక్తపోటును తనిఖీ చేయగా, అది 220/190గా నమోదైంది. ఇది సాధారణ రక్తపోటు (120/80) కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ. అప్పటివరకు పూర్తి ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నానని భావించిన రానా, థాయ్ల్యాండ్ అడవుల్లో దూకుతూ, చెట్లపై తిరుగుతూ వచ్చిన అనుభవాన్ని చెబుతూ, తన రక్తపోటు ఇంత ఎక్కువగా ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని వైద్యులు ఆ రోజంతా అనేక పరీక్షలు నిర్వహించినప్పటికీ, రానాకు ఉన్న అసలు సమస్యను గుర్తించలేకపోయారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించడం, రక్తపోటు ఇంత అధికంగా ఉండటం అనే ఈ రెండు విరుద్ధమైన విషయాలను డాక్టర్లు అర్థం చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితిలో రానా, తన తండ్రితో కలిసి మరింత నిపుణులైన వైద్య సలహా కోసం అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా సమాధానాలు దొరకనప్పుడు, మేయో క్లినిక్కి వెళ్తారని, అక్కడ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విని, వారు మేయో క్లినిక్కు బయలుదేరారు. అమెరికాలోని మేయో క్లినిక్లో మూడు రోజుల పాటు విస్తృతమైన పరీక్షలు జరిగాయి. అక్కడ డా. శాంతి స్వరూప్ వేగే అనే డాక్టర్ రానా ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా వివరించారు. రానాకు పుట్టుకతోనే అధిక రక్తపోటు (Born Hypertensive) ఉందని, అయితే ఇది ఎప్పుడూ గుర్తించబడలేదని తెలిపారు. ఈ దీర్ఘకాలిక సమస్య వల్ల ఆయన గుండె చుట్టూ కాల్షియం పేరుకుపోయిందని, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, సరైన సమయంలో ఈ సమస్యను గుర్తించి చికిత్స చేయకపోతే, ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలోపు స్ట్రోక్ లేదా హెమరేజ్ వచ్చే అవకాశం 70% ఉందని, లేదా మరణించే అవకాశం 30% ఉందని ఆయనకు తెలియజేశారు. ఈ తీవ్రమైన నిజాన్ని విన్న రానా, తన జీవిత దిశను మార్చుకోవాల్సిన అవసరాన్ని గ్రహించారు. అప్పటివరకు తాను అనుభవించిన విలాసవంతమైన జీవనశైలిని తక్షణమే విడిచిపెట్టాలని డాక్టర్లు సూచించారు. మద్యపానం, ధూమపానం పూర్తిగా మానేయాలని, ఉప్పు, మాంసం తినకూడదని, ఆహారాన్ని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆహార ప్రియుడైన రానాకు ఇది ఎంతో కష్టమైనప్పటికీ, ఒక్క రాత్రిలో తన అలవాట్లను పూర్తిగా మార్చుకున్నారు. త్వరగా నిద్రపోవడం, త్వరగా లేవడం, యోగా చేయడం వంటివి దినచర్యలో భాగం చేసుకున్నారు. తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నప్పటికీ, రానా మాత్రం ధైర్యంగా “నేను బాగానే ఉన్నాను” అంటూ అందరికీ ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ఆయన ప్రదర్శించిన దృఢ సంకల్పం, జీవితం పట్ల ఆయనకున్న నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయం.
