Mahesh Babu’s Mother Death: సూపర్ స్టార్ కృష్ణ ఇంట తీవ్ర విషాదం.. మహేష్ తల్లి కన్నుమూత
సూపర్ స్టార్ కృష్ణ ఇంట విషాదం నెలకొంది.. ఆయన సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుశారు. మహేష్ బాబుకు తల్లి అంటే ఎనలేని మమకారం..
సూపర్ స్టార్ కృష్ణ ఇంట విషాదం నెలకొంది.. ఆయన సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుశారు. మహేష్ బాబుకు తల్లి అంటే ఎనలేని మమకారం.. సోషల్ మీడియా వేదికగా ఆయన చాలా సార్లు తన తల్లి పై ఉన్న ప్రేమను చాటుకున్నారు మహేష్. ఇందిరా దేవి కన్నుమూయడంతో కృష్ణ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘట్టమనేని కృష్ణ సతీమణి, ఘట్టమనేని మహేష్ తల్లి బుధవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసినప్పటి నుంచే ఘట్టమనేని వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ సతీమణిగా సినిమా ఇండస్ట్రీతో ఇందిరాదేవికి ఎనలేని అనుబంధం ఉంది. అయితే తామరాకు మీద నీటిబొట్టులా మసలారు ఇందిరాదేవి. భర్త కృష్ణకు జనాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, గడపలోపలకు ఆ ఛాయలను రానిచ్చేవారు కాదు ఆమె.
ఇందిరాదేవిని ప్రాణంగా చూసుకునేవారు పిల్లలు.. పద్మ, మంజుల, ఇందిర ప్రియదర్శిని, రమేష్ బాబు, మహేష్బాబు. ఇద్దరు కొడుకులు సినిమాల్లో ఉన్నా, ఏ రోజూ సినిమా వేడుకలకు హాజరు కావడానికి ఉత్సాహం చూపేవారు కాదు ఇందిరాదేవి. అబ్బాయిలతో పాటు సినిమా రంగం మీద ఆసక్తి పెంచుకున్న మంజుల యాక్టింగ్లోకి వచ్చినప్పుడు ఇందిరాదేవి తల్లిగా కాదనలేకపోయారు. జాగ్రత్తలు చెప్పి ప్రోత్సహించి, సనాతనాన్ని గౌరవించే ఆధునిక భావాలున్న తల్లిగా మెప్పుపొందారు. ఆ కృతజ్ఞతతోనే తన ప్రొడక్షన్ హౌస్కి ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకున్నారు కూతురు మంజుల. అటు మహేష్బాబు, నమ్రత, గౌతమ్, సితార కూడా ఏ పండుగ వచ్చినా ఇందిరాదేవి ఇంట్లో వాలిపోయేవారు. ఆమెతో సమయం గడపడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.
ఇందిరాదేవి పుట్టినరోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి, తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్. ఇందిరా చిన్న అల్లుడు సుధీర్బాబు హీరోగా సినిమాలు చేస్తున్నారు. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇందిరాదేవి మనవడు గల్లా అశోక్ కూడా ఈ మధ్య హీరో సినిమాతో టాలీవుడ్కి పరిచయమయ్యారు. మూడు తరాల హీరోలను తన కుటుంబంలోనే చూసిన అనుభవం ఇందిరాదేవి సొంతం. ఇటీవల పెద్ద కుమారుడు రమేష్బాబు మృతితో ఇందిరాదేవి మరింత కుంగిపోయారు. రమేష్ జ్ఞాపకాల నుంచి ఆమె తేరుకోలేకపోయారు. దానికి తోడు అనారోగ్యబారిన పడటంతో కోలుకోలేక కన్నుమూశారు.
ఆ మధ్య విజయ్ నిర్మల, ఇటీవల రమేష్బాబు మృతితో దిగాలుచెందిన సూపర్స్టార్ కృష్ణకు… ఇప్పుడు ఇందిరాదేవి దూరం కావడం మరింత బాధాకరం. ఈ సమయంలో ఆయనకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఎప్పుడూ సోషల్ మీడియాలో తమ స్టార్కి సంబంధించి ఏవో వార్తలతో హల్చల్ చేసే ఘట్టమనేని అభిమానుల గళం బుధవారం మూగబోయింది. రిప్ అమ్మా, రిప్ ఇందిరాదేవిగారు, రిప్ స్టార్ మదర్ అంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.