కుప్పకూలిన పురాతన భవనం..నవ వధువు, కాబోయే పెళ్లి కూతురు దుర్మరణం
హైదరాబాద్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రెండంతస్తుల పురాతన భవనం ఒకటి కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రెండంతస్తుల పురాతన భవనం ఒకటి కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జరిగిన ప్రమాదంలో మృతిచెందిన మహిళ్లలో ఒకరు భవన యజమాని కూతరు కాగా, మరోకరు కోడలుగా గుర్తించారు. కోడలు ఫరా బేగం ఏడాది క్రితమే ఇంట్లో అడుగుపెట్టగా.. కుమార్తె అనీస్ బేగంకు మరో వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఈ క్రమంలోనే అనుకోని ప్రమాదంతో ఆ ఇద్దరిని మృత్యువు కబళించి వేసింది. తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని మహమ్మద్ ఖాన్తో పాటు పర్వీన్ బేగం, అంజాద్ ఖాన్, హసంఖాన్, హుస్సేన్ ఖాన్.. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, వర్షానికే పాత రేకుల ఇల్లు కూలినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలో ఉన్న భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.