AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Junior Lecturer Posts: జేఎల్‌ పోస్టులకు 10-15 రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన.. త్వరలోనే పోస్టింగ్‌లు

రెండేళ్లుగా నానుతున్న జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. తాజాగా ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ఇంటర్ విద్యా శాఖకు పంపించింది. దీంతో త్వరలోనే ఎంపిక జాబితాను విడుదల చేసి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనుంది. ఈ ప్రక్రియ మరో 10-15 రోజుల్లోనే ప్రారంభంకానుంది. అనంతరం దాదాపు 1,239 మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నారు..

TGPSC Junior Lecturer Posts: జేఎల్‌ పోస్టులకు 10-15 రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన.. త్వరలోనే పోస్టింగ్‌లు
TG Junior Lecturer Posts
Srilakshmi C
|

Updated on: Jan 02, 2025 | 8:38 AM

Share

హైదరాబాద్‌, జనవరి 2: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కాలేజీల రూపురేఖలు మారనుంది. తొలిసారిగా సర్కారు కాలేజీలలో 1,239 మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు జూనియర్‌ లెక్చరర్ల ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్‌సీ) ఇంటర్‌ విద్యాశాఖకు అందజేసింది. వాస్తవంగా 1,392 మంది నియామకాలకు 2022 డిసెంబరులో టీజీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. పలు కారణాల రిత్య అప్పటి నుంచి జాప్యం జరుగుతూ వచ్చింది. ఆంగ్లం సబ్జెక్టుపై వ్యాజ్యం నమోదైన నేపథ్యంలో 153 పోస్టులు పెండింగ్‌లో పడ్డాయి. దీంతో మిగతా పోస్టులకు ఎంపికైన వారి నియామక ప్రక్రియను చేటప్పారు. ఈ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన వచ్చే 10-15 రోజుల్లో జరగనున్నట్లు సమాచారం. ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసి ఆ వెనువెంటనే పోస్టింగ్‌ ఇస్తామని వెల్లడించాయి. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలోపే జూనియర్‌ లెక్చరర్లు విధుల్లో చేరే అవకాశం ఉంది.

కాగా రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. వాటిలో మంజూరైన బోధన పోస్టులు 6,008. వీటిల్లో ప్రస్తుతం 900 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు, ప్రిన్సిపల్స్‌ ఉన్నారు. మరో 3,500 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించారు. ఆ ప్రకారంగా ప్రస్తుతం 4,400 మంది విధుల్లో ఉన్నారు. కొత్తగా 1,239 మంది రానున్నారు. దీంతో శాశ్వత అధ్యాపకుల సంఖ్య 5,639కి చేరుకుంటుంది. ఖాళీలు 369 మాత్రమే ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న ఆంగ్లం పోస్టులు 153 కూడా భర్తీ అయితే ఖాళీలు 216కు తగ్గుతాయి.

ఇక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 24 జూనియర్‌ కళాశాలలు కొత్తగా ఏర్పాటయ్యాయి. వాటిల్లో 19 కాలేజీలకు అధ్యాపక పోస్టులను ఇంతవరకు మంజూరు కాలేదు. ఆయా విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర పోస్టులు 400 అవసరమని కొద్ది నెలల క్రితమే ఇంటర్‌ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయినా వాటిని సర్కారు ఇంకా మంజూరు చేయలేదు. ప్రస్తుతం వీటిల్లో 1,654 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ అధ్యాపకులు విధుల్లో చేరితే వారిని ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం(2025-26)లో ఇంటర్‌కు కొత్త సిలబస్‌ అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.