Budget 2024: నిర్మలాస్ ‘ఖట్టా-మీఠా’..! మోదీ మూడో సర్కార్లో తొలి సాధారణ బడ్జెట్
మోదీ జమానాలో మొట్టమొదటి సంకీర్ణ బడ్జెట్.. ఆర్థికమంత్రిగా నిర్మలమ్మ ప్రవేశపెడుతున్న ఏడవ బడ్జెట్.. కేంద్రంలో తెలుగు రాష్ట్రం నిర్ణయాత్మక శక్తిగా మారిన తర్వాత తొలి బడ్జెట్.. పన్నువసూళ్లలో రికార్డులు బద్దలౌతున్న వేళ సమర్పించే అరుదైన బడ్జెట్.. మూడోసారి మోదీని గెలిపించిన దేశ ప్రజల్లో

మోదీ జమానాలో మొట్టమొదటి సంకీర్ణ బడ్జెట్.. ఆర్థికమంత్రిగా నిర్మలమ్మ ప్రవేశపెడుతున్న ఏడవ బడ్జెట్.. కేంద్రంలో తెలుగు రాష్ట్రం నిర్ణయాత్మక శక్తిగా మారిన తర్వాత తొలి బడ్జెట్.. పన్నువసూళ్లలో రికార్డులు బద్దలౌతున్న వేళ సమర్పించే అరుదైన బడ్జెట్.. మూడోసారి మోదీని గెలిపించిన దేశ ప్రజల్లో ఆశల్ని ఊరిస్తున్న బడ్జెట్..! ఇన్ని స్పెషాలిటీలున్న కేంద్ర సాధారణ బడ్జెట్కి కౌంట్డౌన్ ఘనంగా మొదలైంది. మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ వడ్డన షురూ కాబోతోంది. ఈ కీలక సమయంలో బడ్జెట్కేటాయింపులపై నూటపాతిక్కోట్ల జనాభాలో మిక్స్డ్ ఫీలింగ్స్ ఏంటి..? ఏయే రంగం డిమాండ్లు ఎలా ఉన్నాయి?
రూపాయి రాక- రూపాయి పోక..! వచ్చిన వసూళ్లెన్ని.. చెయ్యబోయే కేటాయింపులు ఎలా? బడ్డెట్ సమయంలో జరిగే రెగ్యులర్ మేథమేటిక్సే ఇవి. కాకపోతే.. మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్ ప్రవేశపెడుతున్న తొలి బడ్డెట్లో మాత్రం సంకీర్ణం అనే కొత్త చాప్టర్ చేరిపోయింది. మేజిక్ ఫిగర్ని మిస్సయ్యి.. మిత్రపక్షాల ఊతంతో నిలబడ్డ కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ సమర్పణ అనేది కత్తిమీద సాము లాంటిదే. అందుకే.. ఏయే రాష్ట్రాల్ని, ఏయే పార్టీల్ని ఏవిధంగా ట్రీట్ చేయాలో ప్రత్యేకంగా కసరత్తు చేశారు. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మోదీ ప్రభుత్వానికి కొన్ని సానుకూల సంకేతాలూ లేకపోలేదు.
గతంలో మౌలికరంగాల అభివృద్ధి కోసం 11 లక్షల కోట్లకు పైగా కేటాయించి.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపినట్టు మోదీ సర్కార్ మీద ప్రశంసలున్నాయి. రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులు, ఓడరేవుల్లాంటి సెక్టార్లు వెలుగులు విరజిమ్ముతున్నట్టు ఇటీవలి ఎన్నికల్లో సగర్వంగా చెప్పుకుంది బీజేపీ. గత ఇంటరిమ్ బడ్జెట్ ఎస్టిమేషన్ కంటే ఈ ఏడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్షా 35 వేల కోట్లు పెరిగాయి. ఈ ఏడాది కూడా ఇదే ఊపులో ట్యాక్స్ కలెక్షన్లు మరింత పెరగవచ్చన్న అంచనాలున్నాయి. ఆర్బీఐ నుంచి మోదీ సర్కార్ ఖజానాకు అనూహ్యంగా 2.11 లక్షల కోట్లు బదలీ అయ్యాయి. ఇది రెగ్యులర్ రాబడికి పూర్తిగా అదనం. ఇవన్నీ నిర్మలమ్మ పద్దును సరళతరం చేసే అంశాలే. వీటికి తోడు.. బడ్జెట్కు ముందస్తుగా సోమవారం ప్రకటించిన ఆర్థిక సర్వేలో సైతం.. అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి.
టీవీ9 తెలుగులో బడ్జెట్ విశేషాలు చూడటానికి కింద లింక్ క్లిక్ చేయండి..
గత సంవత్సరంలో దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని, రాబోయే సంవత్సరంలో ఆర్థిక సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని.. ఆశాభావాన్ని రేకెత్తిస్తోంది తాజా ఆర్థిక సర్వే. సో.. ప్రస్తుతానికైతే ఆల్ ఈజ్ వెల్ అన్నమాట. ఇటువంటి సంకేతాలు రాకముందే బడ్జెట్ హల్వా వేడుకలో జోష్తో పాల్గొన్నారు మేడమ్ నిర్మల. ఈ హల్వాలాగే బోలెడన్ని తియ్యటి కబుర్లు కమింగ్ సూన్ అని సిగ్నల్ ఇచ్చేశారామె.
హల్వాతో నిర్మలమ్మ నోరు తీపి చేసుకున్నారు గాని.. మోదీ సర్కార్కి మాత్రం ఖట్టా మీటా ఫ్లేవర్లు తప్పేలా లేవు. చెప్పుకోదగినన్ని సవాళ్లు మోదీ 11వ బడ్జెట్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి. ఆర్థిక వృద్ధి ఫలాలు ఇప్పటివరకు సంపన్నులకే ఎక్కువగా దక్కాయన్న ఆరోపణల నేపథ్యంలో గ్రామీణ ప్రజలపై ఈ సారి మోదీ బడ్జెట్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. పెద్ద కంపెనీలకు పన్ను తగ్గింపులను చేపట్టారని, ఎగుమతులు పెరుగుతాయన్న అంచనాతో తయారీ రంగానికి మోతాదుకి మించి రాయితీల్నిచ్చారు. దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ స్థిరపడింది.. స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి.. ఇదే సమయంలో దేశంలో అసమానతలు పెరిగాయి. ఈ ఏడాది BMW కార్లు రికార్డు స్థాయిలో అమ్ముడవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
జీతాలు పెరగలేదని, పొదుపులు తగ్గాయని, గౌరవ వేతనాలిచ్చే ఉద్యోగాలు దొరకనే లేదని దిగువ మధ్యతరగతి నుంచి విమర్శలున్నాయి. కోవిడ్ తర్వాత గ్లోబల్ ఆర్డర్లు తగ్గడంతో గత ఐదేళ్లలో ఉద్యోగావకాశాలు మెరుగు పడిన దాఖలా లేదు. ఇంజనీరింగ్ చదివి ఖాళీగా తిరిగే యువతీయువకులు.. మోదీ కొత్త బడ్జెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. బీజేపీకి లోక్సభ సీట్లు తగ్గడానికి నిరుద్యోగం కూడా ప్రధాన కారణమన్న వాదనలున్నాయి. సో.. నిరుద్యోగ సమస్య నిర్మూలన అనే దీర్ఘకాలిక సమస్యపై ఈసారైనా ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం జరగాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.
రైల్వేల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాల కోసం బడ్జెట్లో 2 లక్షల నుంచి 2.25 లక్షల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు లైన్ క్లియర్ కావడం.. దేశవ్యాప్తంగా మరిన్ని వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి డిఫెన్స్ బడ్జెట్ 25 శాతం పెరిగే అవకాశం ఉంది. 2029 నాటికి ఇండియాలోనే మూడు ట్రిలియన్ల రక్షణరంగ ఉత్పత్తులు చేయాలన్నది లక్ష్యం. రక్షణరంగంలో మేక్ ఇన్ ఇండియా నినాదం అమలుపై ఇప్పటికే ఫోకస్ పెట్టింది. దేశానికి అన్నం పెట్టే రైతాంగంపై చిన్నచూపు చూస్తున్నారన్న అపవాదును తుడిపేసుకోబోతున్నారు మోదీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని 8వేల కోట్లకు పెంచడం.. కిసాన్ క్రెడిట్ కార్డుపై ఇచ్చే వ్యవసాయ రుణం పరిమితిని 5 లక్షలకు పెంచడం.. రైతులకు సాగునీటి కోసం రాయితీపై సోలార్ పంపులను అందజేయడం.. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తగ్గించడం.. ఇలా నాలుగు ప్రధాన డిమాండ్లు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి.
ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ను మూడేళ్లలో రెట్టింపు చేసే దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. ఇందులో మొదటి చర్యగా 70 ఏళ్లు పైబడినవారందరినీ ఆయుష్మాన్ భారత్ పథకంలోకి తేవాలన్నది కేంద్రం ఆలోచన. ఆయుష్మాన్ భారత్ కింద కవరేజీ మొత్తాన్ని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీంతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 50 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో మెజారిటీ శాతం అంటే.. దాదాపు 56 శాతం ప్రజలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులున్నారు. ప్రతీ బడ్డెట్లో లాగే.. ఈసారి కూడా మినహాయింపుల్ని ఆశిస్తునట్టు ఓ సర్వేలో తేలింది. కేంద్ర బడ్జెట్ సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా ? సంక్షేమానికి జై కొడుతుందా ? హ్యాట్రిక్ కొట్టి థర్డ్ టైమ్ పవర్లోకొచ్చిన మోదీ.. తన పాలనాతీరులో ఎటువంటి మార్పుల్ని తీసుకొస్తారు..? టోటల్గా మోదీ నయా మైండ్సెట్కి అద్దం పట్టబోతోంది.. నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే ఏడవ సాధారణ బడ్జెట్టు.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..