Andhra Pradesh: లచ్చిందేవి బొమ్మతో ఇనుప బీరువా.. ఏముందోనని ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్!
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవనకొండ కరివేములలో దొరికిన పురాతన భోషాణాన్ని ఓపెన్ చేసేందుకు చేసిన..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవనకొండ కరివేములలో దొరికిన పురాతన భోషాణాన్ని ఓపెన్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు తాళాల్లో ఒకటి మాత్రమే ఓపెన్ అయింది. మరొకటి మొరాయించింది. అయితే సుత్తితో పగలగొట్టేందుకు.. గ్యాస్ కట్టర్తో ఓపెన్ చేసేందుకు రెవిన్యూ అధికారులు ప్రయత్నించా.. అందుకు యజమాని నిరాకరించారు. ఫైనల్గా బీరువాను అమ్మవారి ఆలయానికి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. భోషాణంలో ఏమున్నా ఆలయానికే అని యజమాని స్పష్టం చేశారు. అయితే ఎట్టకేలకు అధికారులు విశ్వప్రయత్నాలు చేసి.. ఆ భోషాణాన్ని ఓపెన్ చేయగా.. కొన్ని పత్రాలు తప్ప.. అది ఖాళీగా ఉండటంతో చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
దేవనకొండలో కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిని.. నర్సింహులు అనే మరో వ్యక్తి కొనుగోలు చేశాడు. పాత ఇల్లు కావడంతో దాన్ని కూల్చేద్దామని జేసీబీలను పురామాయించాడు. అప్పుడు బయటపడిందీ భోషాణం. అందులో ఏముందో తెలీదు.. ఇల్లు అమ్మిన కృష్ణారెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆయన చనిపోవడంతో ఆయన భార్య అక్కడికి చేరుకున్నారు.
సుమారు టన్ను బరువు.. నలుగురైదుగురు కలిసి మూవ్ చేస్తే తప్ప ఈ భోషాణం కదలని పరిస్థితి. దాని లోపల ఏదో ఉందన్న అనుమానం అందరిలో కనిపించింది. భోషాణంపై రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా లక్ష్మీదేవి రూపు ఉంది. పైన ఒక తాళం, కింద ఒక తాళంతో పకడ్బందీగా ఉంది. మామూలుగా రాలేదని ట్రాక్టర్లకు కట్టి ప్రయత్నించారట. అయినా ఓపెన్ కాలేదు.
కృష్ణారెడ్డి భార్య వచ్చాక తాళాలతో ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. అయితే బీరువాను బ్రేక్ చేసేందుకు యజమాని నిరాకరించడంతో ప్రస్తుతానికి లాక్ ఓపెన్కి బ్రేక్ పడింది. యజమాని కోరికతో భోషాణాన్ని ఆలయానికి తరలించారు.




