AP News: ఇలా తయారయ్యారేంట్రా.. పెయింట్ డబ్బాల మాటున యవ్వరానికి కళ్లు తేలేస్తారు
నంద్యాల జిల్లా అవుకులో ఏషియన్ నకిలీ పెయింట్స్ దందా వ్యవహారం వెలుగు చూసింది. కంపెనీ ప్రతినిధులు, పోలీసుల సంయుక్త దాడులు నిర్వహించగా.. 2 లక్షలకు పైగా విలువైన నకిలీ పెయింట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి

నకిలీ కేటుగాళ్ల మాయజాలం నంద్యాల జిల్లా అవుకు పట్టణంలో గుట్టు రట్టయింది. మార్కెట్లో పేరున్న ఏషియన్ కంపెనీ పెయింట్స్, స్టిక్కర్స్తో ఉన్న నకిలీ పెయింట్స్ వ్యాపార దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న రామకృష్ణ పెయింట్స్ ఏజెన్సీ షాప్పై ఢిల్లీ నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులు, పోలీసుల సంయుక్త దాడులలో సుమారు 2 లక్షలకు పైగా విలువైన నకిలీ పెయింట్ డబ్బాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
పెయింట్స్ షాప్ నిర్వాహకుడు రామకృష్ణ(40) అనే నకిలీ వ్యాపార మోసగాడు, గతకొద్ది ఏళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నకిలీ ఏషియన్ పెయింట్స్ను అతి తక్కువ ధరకు వినియోగదారులకు విక్రయిస్తూ, వ్యాపారాన్ని విపరీతంగా పెంచుకుని అనతికాలంలోనే లక్షలాది రూపాయల అక్రమార్జన సొమ్ముతో జేబులు నింపుకున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో స్థానికంగా ఉన్న పోటి వ్యాపారస్తులు, కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ పెయింట్స్ బాగోతం బట్టబయలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులతో ఎస్సై రాజారెడ్డి, రెవెన్యూ అధికారులు 57 నకిలీ పెయింట్ డబ్బాలను.. సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. షాప్ యజమాని రామకృష్ణ వద్ద ఉన్న ఇన్వాయిస్ బిల్లులకు పట్టుబడిన పెయింట్ డబ్బాలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో పాటు యజమాని నుంచి సరైన సమాధానం లేకపోవడంతో కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు షాపు యజమాని నీలి రామకృష్ణపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ కంపెనీకి చెందిన రంగులు కావడంతో కంపెనీ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏషియన్ కంపెనీకి చెందిన నాణ్యత లేని రంగులను విక్రయించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..