Visakhapatnam: పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి అమర్నాథ్ పర్యటన.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు పారిశ్రామిక దిగ్గజాలకు ఆహ్వానం
మంత్రి అమర్నాథ్తో పాటు పరిశ్రమల శాఖా ఉన్నతాధికారుల బృందం ఎంతో కృషి చేస్తోంది. ప్రస్తుతం ముంబైలో పర్యటిస్తున్న ఈ బృందం.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కలిశారు
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖ వేదికగా మార్చిలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మార్చ్ 3, 4 తేదీల్లో ఉక్కునగరంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలను నేరుగా కలిసి ఆహ్వానించాలని నిర్ణయించింది. మంత్రి అమర్నాథ్తో పాటు పరిశ్రమల శాఖా ఉన్నతాధికారుల బృందం ఎంతో కృషి చేస్తోంది. ప్రస్తుతం ముంబైలో పర్యటిస్తున్న ఈ బృందం.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కలిశారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు హాజరు కావలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్ర మంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పరిశ్రమల ప్రముఖులతో పాటు వివిధ దేశాల రాయబారులను ఆహ్వానిస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. పరిశ్రమ, వాణిజ్య రంగాల్లోఇన్వెస్టర్లు భాగం చేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం.
ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డు దేశ రాజధాని ఢిల్లీలో లీలా ప్యాలెస్ హోటల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులనుద్దేశించి సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. రాజధాని విశాఖ నుంచి త్వరలో పరిపాలన మెుదలుపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎక్కడైనా బిజినెస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలంటే… తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కావాలని.. అవి ఏపీలో ఉన్నాయని చెప్పారు. 6 పోర్టులు, 974 కిలోమీటర్ల సముద్రతీరం, 6 విమానాశ్రయాలు, 3 పారిశ్రామిక కారిడార్లు గ్రోత్ ఇంజన్లుగా నిలుస్తున్నాయన్నారు. ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు 21 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.