T20 World Cup 2026 : 10 ఏళ్ల క్రితం నాటి చేదు జ్ఞాపకాలు.. మళ్ళీ అదే వేదిక, అదే టెన్షన్.. ఇండియా గెలిచేనా?
T20 World Cup 2026 : ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం మరో చారిత్రక పోరాటానికి వేదికవుతోంది. నేడు (గురువారం, మార్చి 5) టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లాండ్తో తలపడనుంది. యావత్ భారత్ ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

T20 World Cup 2026 : ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం మరో చారిత్రక పోరాటానికి వేదికవుతోంది. నేడు (గురువారం, మార్చి 5) టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లాండ్తో తలపడనుంది. యావత్ భారత్ ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే, ఈ పోరు కేవలం ఫైనల్ బెర్తు కోసం మాత్రమే కాదు.. వాంఖడే గడ్డపై టీమిండియాను దశాబ్దాలుగా వెంటాడుతున్న కొన్ని చేదు జ్ఞాపకాలను తుడిచిపెట్టుకోవడానికి దొరికిన గొప్ప అవకాశం. 10 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో తగిలిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది, ఇప్పుడు ఇంగ్లాండ్ను ఓడించి ఆ పాత లెక్కలను సరిచేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సరిగ్గా పదేళ్ల క్రితం, అంటే 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్, వెస్టిండీస్లు ఇదే వాంఖడేలో తలపడ్డాయి. నాడు విరాట్ కోహ్లీ అజేయమైన 89 పరుగులతో వీరవిహారం చేయడంతో భారత్ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఫీల్డింగ్ లోపాలు, బౌలింగ్ వైఫల్యాల వల్ల వెస్టిండీస్ ఆ మ్యాచ్ను తన్నుకుపోయింది. ఆ ఓటమి భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్లో, అదే సెమీఫైనల్ గండం, అదే వాంఖడే మైదానం ఎదురవ్వడం కాకతాళీయమే అయినా.. ఈసారి ఫలితం మారాలని అంతా ఆశిస్తున్నారు.
ఇక ఇంగ్లాండ్తో వాంఖడే అనుబంధం భారత్కు అంత కలిసి రాలేదు. 1987 వన్డే వరల్డ్ కప్లో భారత్ తొలిసారి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ను ఇదే వాంఖడేలో ఇంగ్లాండ్ సెమీస్లో ఓడించి ఇంటికి పంపింది. ఇప్పుడు కూడా భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గానే బరిలోకి దిగింది. చరిత్ర రిపీట్ అవుతుందా ? లేక టీమిండియా కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత టోర్నీలో భారత్, ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా తమ పూర్తి స్థాయి ఫామ్ ప్రదర్శించకపోయినా.. సెమీస్ చేరాయి కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయలేం.
ఈ కీలక పోరులో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లడమే కాకుండా, వాంఖడే శాపాన్ని విడగొట్టాలని సూర్యకుమార్ సేన పట్టుదలతో ఉంది. వాంఖడే మైదానం బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ కావడంతో పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. టాస్ గెలిచిన జట్టుకు సానుకూలత ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఒత్తిడిని జయించిన వారే విజేతలుగా నిలుస్తారు. మరి పదేళ్ల పాత గాయానికి టీమిండియా ఈరోజు మందు వేస్తుందో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
