AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ ఆడకముందే టీమిండియాలోకి పిలుపు.. కట్ చేస్తే.. బెంచ్‌కే పరిమితమైన ఐదుగురు అన్ లక్కీ ప్లేయర్లు..!

IPL Debut: కేవలం ఐపీఎల్ ఆడితేనే టీమిండియాలోకి వస్తారనే భ్రమలను వీరు పటాపంచలు చేశారు. దేశవాళీ క్రికెట్లో పట్టువదలకుండా ఆడితే సెలెక్టర్ల దృష్టిలో పడొచ్చని నిరూపించారు. అదృష్టం కలిసిరాక కొందరు కనుమరుగైనా, జాతీయ జట్టు జెర్సీ కోసం వారు పడ్డ తపన యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకం.

ఐపీఎల్ ఆడకముందే టీమిండియాలోకి పిలుపు.. కట్ చేస్తే.. బెంచ్‌కే పరిమితమైన ఐదుగురు అన్ లక్కీ ప్లేయర్లు..!
Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Jul 29, 2026 | 10:10 AM

Share

Indian Cricket Team: ఇప్పుడున్న రోజుల్లో ఇండియన్ టీమ్‌లోకి రావాలంటే ఐపీఎల్‌లో ఆడటం ఒక్కటే షార్ట్ కట్. ఫ్రాంచైజీల దృష్టిలో పడితే చాలు, రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవచ్చు. కానీ ఈ ఐదుగురు క్రికెటర్ల కథ మాత్రం కాస్త భిన్నం. ఐపీఎల్ ఆడకముందే వీరికి జాతీయ జట్టు నుంచి పిలుపొచ్చింది. తీరా చూస్తే పీకలదాకా అదృష్టం వచ్చి ఆగిపోయినట్లు వారి కెరీర్ ముగిసిపోయింది. ఆ విషాద గాథలేంటో చూద్దాం.

దేశవాళీలో సింహాలు.. అదృష్టం ఆమడదూరం

గుజరాత్‌కు చెందిన ప్రియాంక్ పంచాల్ పేరు వినగానే సగటు క్రికెట్ అభిమానికి ఎంతో జాలి కలుగుతుంది. దేశవాళీ క్రికెట్లో వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన అపార అనుభవం అతని సొంతం. ఆ నిలకడైన ప్రదర్శనే 2021 ఇంగ్లండ్ సిరీస్‌కు అతడికి టీమిండియా పిలుపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో సాక్షాత్తూ రోహిత్ శర్మ స్థానంలో ఎంపికైనా సరే బెంచ్‌కే పరిమితమయ్యాడు. డ్రింక్స్ మోయడానికే ఆ సిరీస్ మొత్తం సరిపోయింది. పోనీ 2022లో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసినా మైదానంలో దిగే అవకాశం రాలేదు. అటు టీమిండియా క్యాప్, ఇటు ఐపీఎల్ అరంగేట్రం చేయకుండానే 2025లో తీవ్ర నిరాశతో ఆటకు వీడ్కోలు పలికి అందరినీ కలచివేశాడు.

ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!

ఇవి కూడా చదవండి

అభిమన్యు ఈశ్వరన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. నిలకడైన ఆటతో 2021 నుంచి పలుమార్లు భారత టెస్ట్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ లాంటి వాళ్లు ఐపీఎల్ ద్వారా జట్టులోకి వచ్చేదాకా బ్యాకప్ వికెట్ కీపర్‌గా సేవలందించాడు. జాతీయ జట్టుతో ప్రయాణించినా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. కనీసం ఐపీఎల్‌లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందామని 2026 మినీ వేలంలో పేరు నమోదు చేసుకున్నా ఏ ఫ్రాంచైజీ కనీస ఆసక్తి చూపలేదు. అద్భుతమైన టాలెంట్ ఉన్నా అదృష్టం వరించని అత్యంత దురదృష్టవంతుడిగా ఈశ్వరన్ మిగిలిపోయాడు.

పంజాబ్ కింగ్స్ తీసుకున్నా దక్కని అవకాశం

ఉత్తరప్రదేశ్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ ప్రయాణం కూడా కన్నీటి గాథే. రంజీ ట్రోఫీలో తన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టడంతో 2021 ఇంగ్లండ్ సిరీస్‌కు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఆ వెంటనే టీమిండియా మేనేజ్‌మెంట్ దృష్టిలో పడి జాతీయ జట్టుకు అధికారికంగా పిలుపు అందుకున్నాడు. అదే ఏడాది వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇన్ని అవకాశాలు తలుపు తట్టినా, ఒక్కసారి కూడా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఫ్రాంచైజీ క్రికెట్ సైతం అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం.

కుల్దీప్, సాయి కిషోర్‌ల రూటే సపరేట్..!

ఈ జాబితాలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. 2016లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన కుల్దీప్, 2017లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేశాడని అందరూ అనుకుంటారు. కానీ అసలు నిజం వేరే ఉంది. 2014లోనే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం కుల్దీప్‌కు తొలిసారి టీమిండియా కాల్ వచ్చింది. కాకపోతే అప్పుడు కుర్రాడు కావడంతో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్‌లో తన మణికట్టు మాయాజాలం చూపించిన తర్వాతే అతనికి టీమిండియాలో అసలైన గుర్తింపు దక్కింది.

ఇది కూడా చదవండి: చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

తమిళనాడు ఆల్‌రౌండర్ సాయి కిషోర్ కూడా ఈ కోవలోకే వస్తాడు. 2020లో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని తీసుకున్నా తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. కానీ 2021 శ్రీలంక పర్యటనకు జాతీయ జట్టు నుంచి నేరుగా పిలుపొచ్చింది. అయితే 2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన తర్వాతే అతని దశ తిరిగింది. దేశవాళీలో అలుపెరగని పోరాటం చేసి, ఎట్టకేలకు 2023 ఆసియా క్రీడల్లో టీమిండియా తరపున తొలి మ్యాచ్ ఆడి తన చిరకాల కలను సాకారం చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us