Team India : గంభీర్ నమ్మకస్తుడు కూడా హ్యాండ్ ఇచ్చేశాడు.. మళ్లీ పాత గూటికే చెక్కేశాడుగా
Team India : టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ పదవికి రాజీనామా చేశారు. గౌతమ్ గంభీర్ కు అత్యంత సన్నిహితుడైన ఆయన, రెండేళ్ల తర్వాత మళ్లీ కోల్కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాఫ్ లో చేరనున్నట్లు సమాచారం.

Team India : ఇంగ్లాండ్ పర్యటనలో టీ20, వన్డే సిరీసుల ఓటముల తర్వాత భారత క్రికెట్ జట్టు సపోర్ట్ స్టాఫ్లో కీలక మార్పు చోటుచేసుకుంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తున్న ర్యాన్ టెన్ డోషేట్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బీసీసీఐకి యుకే పర్యటనలోనే ముందస్తు సమాచారం అందించినట్లు క్రిక్ ఇన్ఫో నివేదిక పేర్కొంది. జులై 2024 నుంచి ప్రారంభమైన ఆయన రెండేళ్ల కాంట్రాక్ట్ గడువు 2026 జులై మధ్యనాటికి ముగియడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
2024 టి20 ప్రపంచకప్ విజయం అనంతరం రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో టెన్ డోషేట్ అసిస్టెంట్ కోచ్గా భారత టీమ్లోకి అడుగుపెట్టారు. గంభీర్కు అత్యంత ఆప్తుడైన ఈ నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్.. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలు రెండింటిలోనూ కోచింగ్ గ్రూప్ సభ్యుడిగా కీలక సహకారం అందించారు.
డోషేట్ హయాంలో భారత జట్టు వైట్ బాల్ ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసింది. 2025 ఆసియా కప్ను గెలవడంతో పాటు, 2026లో ఐసిసి పురుషుల టి20 ప్రపంచకప్ టైటిల్ను భారత్ విజయవంతంగా నిలబెట్టుకుంది. అయితే సుదీర్ఘ టెస్టు ఫార్మాట్లో మాత్రం భారత జట్టు కష్టకాలాన్ని ఎదుర్కొంది. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్ (3-0), సౌతాఫ్రికా (2-0) చేతిలో ఘోర పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది.
భారత జట్టు నుంచి వైదొలిగిన టెన్ డోషేట్.. తిరిగి తన పాత ఐపిఎల్ ఫ్రాంచైజీ అయిన కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కోచింగ్ విభాగంలో చేరనున్నారు. పదేళ్లకు పైగా కేకేఆర్తో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆటగాడిగా 2012, 2014 లలో కేకేఆర్ ఐపిఎల్ టైటిళ్లు గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న ఆయన.. 2022లో ఫీల్డింగ్ కోచ్గా తిరిగి వచ్చారు. 2024లో కేకేఆర్ ట్రోఫీ నెగ్గిన సమయంలోనూ కోచింగ్ స్టాఫ్లో ఉన్నారు. ప్రస్తుతం కేకేఆర్లోకి వెళ్లడం ద్వారా ఆయన అభిషేక్ నాయర్తో కలిసి మళ్లీ పని చేయనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
