Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బిగ్ అలర్ట్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక క్లియర్ జాబ్ చార్ట్ను విడుదల చేసింది. ఒకేసారి చాలా పనులు అప్పగించడం, ఏ శాఖ చెప్పిందీ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవ్వడం ఇకపై ఉండదు. ఈ కొత్త జాబ్ చార్ట్కు విరుద్ధంగా ఏ శాఖ ఆదేశాలిచ్చినా, అవి ఆటోమేటిక్గా రద్దు అవుతాయి. ఒకవేళ ఎక్కువ పనులు చేయాల్సి వస్తే, జిల్లా కలెక్టరే ఫైనల్గా పనుల ప్రాధాన్యతను నిర్ణయిస్తారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి వివిధ పనులు అప్పగిస్తూ.. ఏ శాఖ ఆదేశాలు ఇస్తే ఆ పని చేయాలనే కన్ఫ్యూజన్కి చెక్ పెట్టింది. పలు సంఘాల ఫిర్యాదులతో రియాక్ట్ అయిన ప్రభుత్వం.. సచివాలయ సిబ్బంది కోసం ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ను రిలీజ్ చేసింది. ఇకపై ఏ శాఖ అయినా ఈ కొత్త గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తే, అవి ఆటోమేటిక్గా రద్దు అవుతాయి. ఒకవేళ సిబ్బంది ఒకేసారి పలు పనులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడితే, ఆయా పనుల ప్రాధాన్యతను నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్కు అప్పగించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కలెక్టర్, జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో తప్పనిసరిగా చర్చించాలి.
సచివాలయ సిబ్బందికి సాధారణ జాబ్ ఛార్ట్
ప్రభుత్వం విడుదల చేసిన సాధారణ జాబ్ ఛార్ట్ ప్రకారం.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఈ కీలక విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది:
అభివృద్ధి ప్రణాళికలు: గ్రామ, వార్డుస్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో యాక్టివ్గా పాల్గొనాలి.
పథకాల అమలు: ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా ఆయా పథకాల ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్లో పాల్గొనాలి.
సేవల డోర్ డెలివరీ: ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు, సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దే అందించడం.
సమాచార సేకరణ: ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించడం.
ఫిర్యాదుల పరిష్కారం: సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం కోసం నిరంతర ఫాలో-అప్ చేపట్టాలి.
అత్యవసర విధులు: విపత్తుల సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి.
నిర్వహణ బాధ్యత: ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఏ పనినైనా చేయాలి, ఇంకా ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాస్ కావాలి.
అమలు, పర్యవేక్షణ
ఈ జాబ్ ఛార్ట్ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యతను పూర్తిగా జిల్లా కలెక్టర్లు లేదా నియామక అధికారులు తీసుకోవాలి. సిబ్బంది ఈ విధులను అమలుచేయడంలో విఫలమైతే, వారిపై కలెక్టర్లు క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు సచివాలయ వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




