AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ద్వీపంలో చైనా నౌకల హల్‌చల్.. చేపలవేట ముసుగులో ఏంట్రీ.. అసలేం జరుగుతోంది..

డ్రాగన్‌ పొరుగుదేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా ఫిలిప్పీన్స్‌ ఆధీనంలోని ద్వీపం వద్ద చైనా నౌకలు హల్‌చల్‌ చేశాయి. ఆ ద్వీపాలకు సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దుజలాల ఒప్పందాన్ని ఉల్లంఘించాయి.

ఆ ద్వీపంలో చైనా నౌకల హల్‌చల్.. చేపలవేట ముసుగులో ఏంట్రీ.. అసలేం జరుగుతోంది..
Chinese Naval Ship
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2023 | 7:46 AM

Share

చైనా మరోసారి తన పొరుగు దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొంది. ఈ సారి ఫిలిప్పీన్స్‌ ఆధీనంలోని ఓ ద్వీపం వద్దకు చైనా నావికాదళానికి చెందిన నౌకలు, చేపలవేట ముసుగులో మిలీషియా పడవలు దూసుకెళ్లాయి. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు జలాల విషయంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్‌ నేవీ కూడా ధ్రువీకరించింది. చైనాకు చెందిన 42 మిలీషియా పడవలను ‘థిటు’ ద్వీపానికి అత్యంత సమీపంలో చూసినట్లు ఫిలిప్పీన్స్‌ పేర్కొంది. వీటికి కొద్ది దూరంలో చైనాకు చెందిన కోస్టుగార్డ్‌, నౌకాదళ ఓడలు నిదానంగా కదులుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. ఫిలిప్పీన్స్‌ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. ఈ నౌకల చిత్రాలను ఫిలిప్పీన్స్‌ కోస్ట్‌గార్డ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది.

ఈ విషయంపై మనీలాలోని చైనా రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. దక్షిణ చైనా సముద్రంలో థిటు ద్వీపం ఫిలిప్పీన్స్‌కు ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక ప్రాంతం. కానీ, దీని సమీపంలోని సముద్ర జలాలను చైనా తనవిగా వాదిస్తోంది. ఇప్పటికే చైనా వ్యవహారశైలిపై ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క అంగుళం కూడా భూమి పోగొట్టుకోమని ఇటీవలే తేల్చి చెప్పారు. థిటు ద్వీపం పశ్చిమ ఫిలిప్పీన్స్‌లోని పాల్వన్‌ ప్రావిన్స్‌కు 300 మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడ కేవలం 400 మంది జనాభా మాత్రమే ఉన్నారు. వీరిలో సైనికులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది కూడా ఉన్నారు.

మనీలా ప్రాదేశిక జలాలపై హక్కు కాపాడుకోవడానికి ఈ ద్వీపం చాలా కీలకం. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం చేయడానికి చైనా చేపల పడవలను, కోస్టుగార్డులను ఆయుధాలుగా వాడుకొంటోంది. నిరంతరం ఈ పడవలు వివాదాస్పద ప్రాంతాల్లో ఉండటంతో ఇతరులు అక్కడ చేపల వేట నిర్వహించడం, చమురు అన్వేషణ చేపట్టడం కష్టంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..