Eggs: మీరు కొనే గుడ్లు తాజాగా ఉన్నాయా..? లేదా పాడైపోయాయా?.. సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?
మీరు మార్కెట్లో ఏదైనా వస్తువుల కొనుగోలు చేసినప్పుడు వాటిపై తయారు చేసిన డేట్, ఎక్స్పెరీ డేట్ అనేది ఉంటుంది. అయితే త్వరలో కోడిగుడ్లకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నారు. ప్రతీ గుడ్డుపై ఉత్పత్తి తేదీ, గడువు తేదీ పొందుపర్చాల్సి ఉంటుంది.

యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సురక్షితమైన గుడ్లు అందేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా కొత్త నిబంధన తీసకొచ్చింది. అదేంటంటే. ఇక నుంచి గుడ్లపై ఉత్పత్తి తేదీతో పాటు గడువు తేదీ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని గుడ్ల సరఫరా, తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. పాడైపోయిన గుడ్లు, నిల్వ చేసిన గుడ్లను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వినియోగదారుల భద్రత, నాణ్యమైన ప్రొడక్ట్ అందేలా చేయడమే దీని లక్ష్యమని తెలిపింది. దీని వల్ల ప్రజలు కొనుగోలు చేసేముందు గుడ్లు తాజాగా, సురక్షితంగా ఉన్నాయా అనేది తెసుకోవచ్చు.
ప్రభుత్వం కొత్త నిబంధనలు
అన్ని పాల్ట్రీ ఫామ్స్, సరఫరాదారులు ఇక నుంచి ప్రతీ గుడ్డుపై ఏ రోజు ఉత్పత్తి అయింది..? ఎప్పటివరకు గడువు ఉంటుంది..? అనే వివరాలు స్పష్టంగా పొందుపర్చాల్సి ఉంటుంది. దీని వల్ల ఆ డేట్లను పరిశీలించి కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గుడ్లను ధ్వంసం చేయడం లేదా వినియోగించడానికి వీల్లేకుండా అనర్హమైనవిగా అధికారులు ప్రకటించవచ్చు. చాలామంది దుకాణాదారులు కుళ్లిన గుడ్లను కస్టమర్లను అంటగడుతున్నారు. ఇంటికెళ్లి వీటిని పగలగొట్టాక గుడ్లు నల్లగా కుళ్లిపోయా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. దీంతో గుడ్ల నాణ్యతపై నియంత్రణ పెంచేందుకు, వినియోగదారులకు తాజా గుడ్లు అందేలా చూసేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది.
ఇలా చేయొద్దు
సాధారణంగా గుడ్లు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర రెండు వారాల పాటు నిల్వ ఉండే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇక 2 నుంచి 8 డిగ్రీల దగ్గర రిఫ్రిజిరేటర్లో ఉంచితే ఐదు వారాల పాటు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలతో కలిసి గుడ్లను నిల్వ చేయకూడదని చెబుతున్నారు. కూరగాయలను వేరే ఉష్ణోగ్రతల దగ్గర స్టోర్ చేయాల్సి ఉంటుంది. వాటితో కలిసి గుడ్లను స్టోర్ చేయడం వల్ల తక్కువకాలంలోనే పాడైపోతాయి. ఇటీవల యూపీలో కొన్ని దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కుళ్లిన, ఎక్కువ రోజులు నిల్వ చేసిన గుడ్లను విక్రయిస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా ఓ మహిళ క్విక్ కామర్స్ యాప్లో గుడ్లు ఆర్డర్ పెడితే కుళ్లిన గుడ్లు డెలివరీ చేశారు. ఆమె సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
