CBSE Class 12 Exams Cancelled: సీబీఎస్సీ బోర్డు షాకింగ్ నిర్ణయం.. 12వ తరగతి అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
సీబీఎస్సీ బోర్డు మార్చి 16 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలు అన్నీ రద్దు చేసింది. ఈ మేరకు పశ్చిమాసియాలోని పలు దేశాలలో సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువరించింది..

ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు సంక్షోభ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలోని పలు దేశాలలో సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువరించింది. ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షలు వాయిదా వేసిన బోర్డు మిగిలిన అన్ని పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆదివారం (మార్చి 15) ప్రకటించింది. యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్న బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని 150 కి పైగా CBSE అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్ధుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని బోర్డు 12వ తరగతి పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సీబీఎస్సీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
కాగా మార్చి 1 నుంచి సీబీఎస్సీ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఇప్పటి వరకు బోర్డు 6 సర్క్యులర్లను జారీ చేసింది. ప్రభావిత దేశాల్లోని పాఠశాలలు, అధికారుల నుంచి వచ్చిన ఇన్పుట్, అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE లలోని విద్యార్థులకు మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 వరకు జరగాల్సిన అన్ని 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు బోర్డు ప్రకటించింది. ఈ దేశాలలో 12వ తరగతి ఫలితాల ప్రకటన విధానం త్వరలోనే విడిగా తెలియజేస్తామని CBSE పరీక్ష కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ సర్క్యులర్లో తెలిపారు. ఈ మేరకు ఆయా దేశాల్లోని భారత రాయబారులతో పాటు దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్కు సమాచారం అందించింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగిన 12వ తరగతి బోర్డు పరీక్షలన్నింటినీ నిర్విఘాతంగా నిర్వహించింది. ఆ తర్వాత పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం మొదలైంది. దీంతో మార్చి 1 నుంచి జరగాల్సిన పరీక్షలు పలు దఫాలుగా వాయిదా వేసింది.
Important Update on CBSE Class XII Exams in Middle East Countries
CBSE has issued Circular -6 regarding cancellation of Board Exams of Class XII in Middle East countries
See attachment for further details pic.twitter.com/FfZc5vKMHT
— CBSE HQ (@cbseindia29) March 15, 2026
అయితే భారత్లో మాత్రం ఈ టైంలో జరగాల్సిన బోర్డు ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, అకౌంటెన్సీ, జాగ్రఫీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల పరీక్షలన్నీ విజయవంతంగా నిర్వహించింది. బోర్డు తాజా నిర్ణయంతో బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, UAEలోని సీబీఎస్సీ అనుబంధ పాఠశాలల్లో 12వ తరగతి విద్యార్ధులకు పరీక్షలు రద్దు అయ్యాయి. కొత్త షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ నిర్ణయం గల్ఫ్ ప్రాంతంలోని CBSE-అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను ప్రభావితం చేస్తుంది. దుబాయ్, అబుదాబి, దోహా, రియాద్ కీలక పరీక్షా కేంద్రాలలో అధికమంది విద్యార్ధులు ఉన్నారు. కాగా 2020 – 2021లో కూడా COVID-19 మహమ్మారి సమయంలో భారత్, విదేశాలలో పలు 10, 12 తరగతుల పరీక్షలు వాయిదా పడగా.. మరికొన్ని రద్దు అయ్యాయి. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 నుంచి సీబీఎస్సీ 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు ముగియగా.. 12వ తరగతి పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు 4.37 మిలియన్లకు పైగా విద్యార్థులు రాస్తున్నారు. ఇందులో దాదాపు 2.51 మిలియన్ల మంది 10వ తరగతి విద్యార్థులు ఉండగా.. 1.86 మిలియన్ల మంది 12వ తరగతి విద్యార్థులు ఉన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




