AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విఫలమైన చర్చలు.. ముదురుతున్న దిగ్బంధనం.. ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి.. ట్రంప్ తదుపరి అడుగు ఎటు?

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, శాంతి స్థాపన కోసం పాకిస్తాన్ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా పంపిన ప్రత్యేక సందేశాన్ని ఇరాన్‌కు చేరవేసేందుకు పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో టెహ్రాన్‌కు చేరుకున్నారు.

విఫలమైన చర్చలు.. ముదురుతున్న దిగ్బంధనం.. ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి.. ట్రంప్ తదుపరి అడుగు ఎటు?
Asim Munir Reaches Tehran
Balaraju Goud
|

Updated on: Apr 15, 2026 | 9:09 PM

Share

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, శాంతి స్థాపన కోసం పాకిస్తాన్ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా పంపిన ప్రత్యేక సందేశాన్ని ఇరాన్‌కు చేరవేసేందుకు పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో టెహ్రాన్‌కు చేరుకున్నారు. ఉద్రిక్తతలను తగ్గించి, విఫలమైన చర్చలను పునరుద్ధరించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.

గత శనివారం (ఏప్రిల్ 11, 2026) ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయ్ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికా కొన్ని “నిరాధారమైన, అసమంజసమైన” డిమాండ్లను తెరపైకి తెచ్చింది. దీనివల్ల చర్చలు ప్రతిష్టంభనలోకి వెళ్లాయి. అయితే, శాంతి మార్గం పూర్తిగా మూసుకుపోలేదని, పాకిస్తాన్ ద్వారా సందేశాల మార్పిడి నిరంతరం జరుగుతోందని ఆయన ధృవీకరించారు.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంక్షోభంపై భిన్నమైన సంకేతాలు ఇస్తున్నారు. ఒకవైపు హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళం దిగ్బంధనం విధించి, ఇరాన్ సముద్ర వాణిజ్యాన్ని దెబ్బతీస్తోంది. మరోవైపు, ఈ వారంలోనే రెండో విడత చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. “ముందున్న రెండు రోజులు అత్యంత కీలకం. ఒక ఒప్పందం కుదిరితే ఇరాన్ తన దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఒక విభిన్నమైన ప్రభుత్వం ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఇరాన్ – అమెరికా మధ్య ప్రత్యక్ష సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, పాకిస్తాన్ సైన్యాధిపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. టెహ్రాన్‌లో జరగబోయే ఈ రెండో విడత చర్చలు విజయవంతమైతే, మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణకు, శాంతికి మార్గం సుగమం అవుతుంది. ఇరాన్ కూడా పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో, ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు టెహ్రాన్ వైపు మళ్లింది. ఒకవైపు ఆర్థిక దిగ్బంధనం, మరోవైపు దౌత్యపరమైన చర్చల మధ్య ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఏదేమైనా, రాబోయే 48 గంటలు మధ్యప్రాచ్య భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us