Bangladesh’s Padma Bridge inaugurated: బంగ్లాదేశ్లో పద్మా నదిపై నిర్మించిన అతి పెద్ద వంతెనను ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. రోడ్డు, రైలు మార్గాలు ఉన్న ఈ మల్టీపర్పస్ వంతెన, బంగ్లాదేశ్ దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జ్ కావడం విశేషం. రాజధాని నగరం ఢాకా, ప్రాంతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన మోంగ్లా ఓడరేవు మధ్య దూరాన్ని ఇది భారీగా తగ్గిస్తుంది. ఈ వంతెన కేవలం ఇటుకలు, సిమెంట్, స్టీల్, కాంక్రీట్ కలగలిపిన నిర్మాణం మాత్రమే కాదని, బంగ్లాదేశ్ శక్తి సామర్థ్యాలు, గౌరవానికి చిహ్నమని ప్రధాని హసీనా చెప్పారు. ఈ వంతెన బంగ్లాదేశ్ ప్రజలందరిదని స్పష్టం చేశారు. వంతెన ప్రారంభంతో బంగ్లాదేశ్లోని 17 కోట్ల ప్రజల కల సాకారమైందన్నారు. భారత్లోని కోల్కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాల మధ్య ప్రయాణ సమయాన్నీ ఈ వంతెన దాదాపు సగం వరకు తగ్గిస్తుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వంతెన ఎన్నో విశేషాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ప్రధాన వంతెన పొడవు మొత్తం 6.15 కిలోమీటర్లు. ఇందులో రైల్వే వయాడక్ట్ పొడవు 532 మీటర్లు. నాలుగు లేన్ల రోడ్డు వయాడక్ట్ పొడవు 3.14 కిలోమీటర్లు. ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 3.6 బిలియన్ డాలర్లు ఖర్చయ్యింది. అయితే, అవినీతి ఆరోపణలతో వల్డ్ బ్యాంకు అప్పు ఇచ్చేందుకు నిరాకరించగా, పూర్తిగా ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్మించారు.
2015లో ప్రారంభమై, 2022 జూన్ నాటికి పూర్తయింది. ఈ వంతెన నైరుతి బంగ్లాదేశ్లోని 19 జిల్లాలను, ఢాకాతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. చైనాకు చెందిన రైల్వే మేజర్ బ్రిడ్జ్ ఇంజినీరింగ్ గ్రూప్ ఈ బ్రిడ్జ్ను నిర్మించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..