Pakistan: పాక్ రాజకీయాల్లో సంచలనం.. తొలి మహిళా ముఖ్యమంత్రిగా నవాజ్ సరికొత్త రికార్డ్
ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు చట్ట సభల్లో అడుగు పెడుతూ మగవాళ్లకు సవాల్ విసురుతున్నారు. ఆకాశంలో సగం అన్నింట్లో సగం అంటూ దూసుకుపోతున్నారు. ముస్లిం దేశాల్లో సైతం మహిళలు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖిస్తున్నారు. తాజాగా ఓ మహిళ ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు క్రియేట్ చేశారు.

ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు చట్ట సభల్లో అడుగు పెడుతూ మగవాళ్లకు సవాల్ విసురుతున్నారు. ఆకాశంలో సగం అన్నింట్లో సగం అంటూ దూసుకుపోతున్నారు. ముస్లిం దేశాల్లో సైతం మహిళలు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖిస్తున్నారు. తాజాగా ఓ మహిళ ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు క్రియేట్ చేశారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ ఎన్నికయ్యారు.
పాకిస్థాన్ లోని ఓ ప్రావిన్స్ కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. 371 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 220 ఓట్లు సాధించి విజయం సాధించారు. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో ప్రతిపక్ష సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ అధ్యక్షత వహించారు.
ఈమె ఎవరో తెలుసా
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్, తన కుటుంబం నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి అయిన నాలుగో సభ్యురాలు. గతంలో ఈ పదవిని ఆమె తండ్రి, సోదరుడు షెహబాజ్, షెహబాజ్ కుమారుడు హమ్జా నిర్వహించారు.
1973లో జన్మించిన మరియం తోబుట్టువులందరిలో పెద్దది. తన తండ్రి నవాజ్ షరీఫ్ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి అత్యంత అర్హత కలిగిన రాజకీయ వారసురాలిగా ఎదిగారు. 2017లో నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి అనర్హుడయ్యాక మరియం రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా మారి పార్టీలో కీలక పాత్ర పోషించారు.
శక్తివంతమైన మహిళ
పనామా పేపర్స్ కుంభకోణంలో ఆమె పేరు బయటకు రావడంతో పాక్ సుప్రీంకోర్టు ఆమెను ప్రభుత్వ పదవి నుంచి అనర్హురాలిగా ప్రకటించడంతో ఆమె రాజకీయ జీవితం దెబ్బతింది. ఆమె మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పాక్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఆమె రాజకీయ పార్టీ ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ ఆమె నిర్దోషి అని వాదిస్తూనే ఉంది. 2017 లో మరియం మోస్ట్ పాపులర్ కావడంతో బిబిసి 100 మహిళల జాబితాలో స్థానం పొందింది. న్యూయార్క్ టైమ్స్ 2017 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 11 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు.
ముఖ్యమంత్రి ఎన్నికల్లో విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీలో తన మొదటి ప్రసంగంలో మరియం మాట్లాడుతూ ఇది “ప్రతి మహిళ, ప్రతి తల్లి, ప్రతి సోదరి విజయం” అని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆమె ప్రతిజ్ఞ చేశారు.