Betting Apps: పరారీలో సెలబ్రిటీలు.. బెట్టింగ్ పాపాల లెక్కలు తేలడం పక్కా..!
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఒకే సంవత్సరంలో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తేలింది. సినీనటులు, ఇన్ఫ్లూయెన్సర్లు ప్రమోషన్లలో పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటివరకు 108 వెబ్సైట్లు బ్లాక్ చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు జరుగుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో చట్టపరమైన సలహా తీసుకుంటోంది.

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. బెట్టింగ్ యాప్స్ యజమానులే టార్గెట్గా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న బాధితుల వివరాలు సేకరించారు. బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఒక్క ఏడాదిలో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు చేశారు. ఆయా బెట్టింగ్ యాప్స్ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు.
అయితే బెట్టింగ్ యాప్స్ కేసులపై పోలీస్శాఖ లీగల్ ఒపీనియన్కు వెళ్లబోతుంది. స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే ప్రకటనలు చేశామంటున్నారు విజయ్, రానా. అయితే సెలబ్రిటీల నుంచి కీలక అంశాలు రాబట్టిన పోలీసులు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైన ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేశారు. మరో 133 బెట్టింగ్ ప్లాట్ఫామ్స్కు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ వెబ్సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా. జియో-ఫెన్సింగ్ టెక్నాలజీతో TGCSB చర్యలు తీసుకుంటోంది.
కాగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, తేస్టీ తేజ, కిరణ్గౌడ్లను పోలీసులు విచారించారు. శ్యామల, అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్లను విచారణ కోసం సంప్రదించగా వారి ఫోన్లు స్విచాఫ్ వచ్చినట్లు సమాచారం. అలాగే మరికొందరు ఇన్ఫ్లూయెన్సర్లు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో సినీనటులు, ఇన్ఫ్లూయెన్సర్లు భారీగా లబ్ధి పొందారని, అసలు వారికి ఏయే మార్గాల్లో డబ్బు వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.