Telangana: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై తెలంగాణ హైకోర్టు స్టే
తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. ..

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 అమలుపై కోర్టు మధ్యంతర స్థాయిలో స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లు వేసిన తర్వాత.. అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. చివరగా.. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ విచారణను కోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బుధవారం, గురువారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్లు తేలిందన్న ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే.. అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.
మరో న్యాయవాది రవివర్మ తెలంగాణ ప్రభుత్వం తరపున తన వాదనలు వినిపిస్తూ… రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతంతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.




