AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎంతకు తెగించార్రా.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ముక్కలుగా నరికి.. ఖమ్మంలో దారుణం..

ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లును , డబ్బు కోసం అశోక్ అనే నిందితుడు కిరాతకంగా చంపేశాడు. హత్యకు ముందు, మృతదేహాన్ని ముక్కలు చేసి, ఆనవాళ్లు లేకుండా ఎలా పడేయాలని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ప్లాన్ చేశాడు.

Telangana: ఎంతకు తెగించార్రా.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ముక్కలుగా నరికి.. ఖమ్మంలో దారుణం..
Khammam Murder Case Solved
N Narayana Rao
| Edited By: Krishna S|

Updated on: Oct 09, 2025 | 1:15 PM

Share

ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన అత్యంత కిరాతక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దర్యాప్తులో వెలుగు చూసిన సంచలన విషయాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన గట్టా వెంకటేశ్వర్లు(38) హైదరాబాద్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 14న గ్రామంలో జరిగిన ఒక శుభకార్యంలో పాల్గొని సెప్టెంబర్ 15న హైదరాబాద్‌కు తిరిగి వెళుతున్నానని తన బావకు చెప్పి బయలుదేరారు. ఆ తర్వాత మూడు రోజుల వరకు వెంకటేశ్వర్లు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన బావ యాదగిరి సెప్టెంబర్ 22న కామేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వెలుగులోకి దారుణ హత్య

దర్యాప్తులో వెంకటేశ్వర్లు బ్యాంకు ఖాతా నుంచి డిజిటల్ లావాదేవీలు జరుగుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఆధారాల ద్వారా అశోక్ అనే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన వెంకటేశ్వర్లుకు, ప్రధాన నిందితుడు అశోక్‌కు ఖమ్మంలోని లైబ్రరీలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు తరచూ కలుసుకునేవారు. వెంకటేశ్వర్లు వద్ద ఉన్న నగదు కోసమే అశోక్ ఈ హత్యకు ప్లాన్ చేశాడు. హత్యకు ముందు, మృతదేహాన్ని ఎలా ముక్కలుగా నరకాలి, ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా ఎలా పడేయాలి అనే విషయాల గురించి అశోక్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసి, పూర్తిగా ప్లాన్ చేసుకున్నట్టు విచారణలో తేలింది.

సెప్టెంబర్ 16న వెంకటేశ్వర్లును తన రూమ్‌కు పిలిపించిన అశోక్.. అతను నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా కత్తితో ముక్కలుగా నరికి హత్య చేశాడు. ఆ తర్వాత శరీరం భాగాలను బైక్‌పై తీసుకొచ్చి ఖమ్మం శివారు ప్రాంతాల్లో పడేశాడు. ఈ హత్య కేసులో అశోక్‌కు సహకరించిన నగ్మా, కృష్ణయ్య అనే మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, ఫోన్లు, అలాగే వెంకటేశ్వర్లుకు చెందిన గోల్డ్ చైన్, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరాతక హత్య స్థానికంగా భయాందోళనలు సృష్టిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..