Cyber Crimes: సైబర్ నేరాలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి.. లేదంటే మీ డబ్బు తిరిగి రాదు
ఒకప్పుడు ఇంత టెక్నాలజీ ఎక్కడిది..? అందుకే దొంగలు ఇళ్లను కొల్లగొట్టి వెళ్ళిపోయేవారు. రోడ్డుపైనే దోపిడీలు, గొలుసు దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ఈ రకం నేరాలు తగ్గి.. సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇబ్బడి ముబ్బడిగా సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు స్కామర్స్. ఐతే ఇలా సైబర్ నేరాల బారిన పడేవారు.. పెద్దగా ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి.

జాతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కు చెందిన టోల్ఫ్రీ 1930కు కాల్ చేసి.. సంబంధిత వివరాలు గంటలోపే తెలియజేస్తూ ఉండటంతో మోసగాళ్ల బ్యాంకు ఖాతాలు వెంటనే ఫ్రీజ్ అవుతున్నాయి. అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చేందుకు అందరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా అకౌంట్లలలో ఫ్రీజ్ అయిన డబ్బు అలానే ఉండిపోతుంది. గత సంవత్సరం జాతీయ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కి వచ్చిన ఫిర్యాదులకు, కేసుల నమోదుకు అస్సలు సంబంధం లేదు. 2024లో తెలంగాణ నుంచి NCRP కి 1,14,174 కంప్లైంట్స్ రాగా 24,643 కేసులు మాత్రమే FIR అయ్యాయి. ఈ లెక్కన సగటున 21.16 శాతం మాత్రమే FIRలుగా నమోదవుతున్నాయి.
బాధితులు.. నష్టపోయిన నగదు తిరిగి పొందాలంటే కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి. ఆ వివరాల ప్రకారమే పోలీసులు ఫలానా వ్యక్తి అకౌంట్ నుంచి స్కామర్స్ ఖాతాకు నగదు బదిలీ అయ్యిందని… తిరిగి ఇచ్చేందుకు కోర్టును అనుమతి కోరతారు. కోర్టు అనుమతిస్తే బ్యాంకులు ఖాతాలను అన్ఫ్రీజ్ చేసి డబ్బు బాధితుడికి అందజేస్తారు. కొందరు కొద్ది మొత్తం కోసం పోలీస్స్టేషన్కు వెళ్లడం ఇబ్బంది అనుకోవడం, విషయం బయట పడితే నలుగురిలో నవ్వుల పాలు అవుతామని అపోహ పడటం, ఆ డబ్బు ఇక రాదు అనుకోవడం వంటి కారణాల చేత స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్బాల్లో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణంగా తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




