ORR Lease Row: రేవంత్ రెడ్డి ఆరోపణలపై HMDA సీరియస్.. లీగల్ నోటీసులు జారీ.. 48 గంటలే డెడ్లైన్..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లీజు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు బేషరతుగా 48 గంటల్లో మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని HMDA లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఓఆర్ఆర్ టెండర్ల వివాదం మరింత ముదురుతోంది. తప్పుడు ఆరోపణలు చేశారంటూ…పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి లీగల్ నోటీసులు పంపింది హెచ్ఎండీఏ. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా..రేవంత్ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయ పడింది. నేషనల్ హైవే అథారిటీ మార్గదర్శకాలను పాటిస్తూనే ఓఆర్ఆర్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ బిడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్లో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది HMDA.
రాజకీయాల కోసం మీడియా ముందు రేవంత్రెడ్డి చేసిన అసత్య ఆరోపణల వల్ల..సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిందని హెచ్ఎండీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు అందుకున్నాక, 48 గంటల్లోగా బహిరంగంగా, బేషరతు క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసింది హెచ్ఎండీఏ. లేదంటే, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ హెచ్చరించింది. అయితే, హెచ్ఎండీఏ పంపిన లీగల్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటానన్నారు రేవంత్.
ఓఆర్ఆర్ టోల్ టెండర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ORR టెండర్ల విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. RB సంస్థకు ఇచ్చిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం 30 రోజుల్లో 25 శాతం నిధులు చెల్లించారా అని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఓఆర్ఆర్ టోల్ స్కాం వెయ్యి రెట్లు పెద్దదని ఆరోపించారు రేవంత్రెడ్డి. లక్షకోట్ల ఆస్తిని కేవలం 7వేల కోట్లకు కట్టబెట్టారని విమర్శించారు. దీనిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని బీజేపీ నేతలను నిలదీశారు రేవంత్.
ఓఆర్ఆర్ లీజు విషయంలో కన్సెషనల్ అగ్రిమెంట్లోని అంశాలను, టెండర్ ప్రక్రియలో జరిగిన విషయాలనే తాను ప్రస్తావించానని, వాస్తవాలను వక్రీకరించలేదన్నారు రేవంత్. తానూ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, లీగల్గానే పోరాడడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం