Crime Report 2021: ఈ ఏడాది హైదరాబాద్‌ నేరాలు పెరిగాయా? తగ్గాయా? క్రైమ్‌ రిపోర్టు ఏం చెబుతోందంటే..

2021 సంవత్సరంలో ఎన్నో ఒడిదొడుకులు మధ్య పోలీసులు తమ విధులు నిర్వర్తించారు. గత ఏడాదితో పోల్చితే క్రైం రేట్ కొంత తగ్గినా కరోనా కారణంగా గత రెండేళ్లలో పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదరయ్యాయని చెప్పాలి. గతే

Crime Report 2021: ఈ ఏడాది హైదరాబాద్‌ నేరాలు పెరిగాయా? తగ్గాయా? క్రైమ్‌ రిపోర్టు ఏం చెబుతోందంటే..
Follow us

| Edited By: Basha Shek

Updated on: Dec 22, 2021 | 6:53 PM

2021 సంవత్సరంలో ఎన్నో ఒడిదొడుకులు మధ్య పోలీసులు తమ విధులు నిర్వర్తించారు. గత ఏడాదితో పోల్చితే క్రైం రేట్ కొంత తగ్గినా కరోనా కారణంగా గత రెండేళ్లలో పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పాలి. గతేడాది లాగే ఈ ఏడాది కూడా బందోబస్తులు, కోవిడ్ పరిస్థితుల్లో ఉరుకుల పరుగులు తప్పలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల పనితీరుపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తినా.. సమర్థంగా విధులు నిర్వహించేందుకే ప్రయత్నించామంటున్నారు పోలీసులు.   అందుకే ఎప్పుడు లేని విధంగా హుసేన్ సాగర్ లోని శాంతికి ప్రతీకగా ఉన్న బుద్ధుని విగ్రహం వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు . ఈ క్రమంలో 2021 లో హైదరాబాద్ లో జరిగిన నేరాలు , కేసుల చేధింపులపై   క్రైమ్ రివ్యూ ఒక్కసారి చూద్దాం.

కరోనా తో ప్రారంభం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తుంది పోలీస్ శాఖ. ఏటా పోలీస్ శాఖ తమ ఏడాది పనితీరును నెమరువేసుకుంటుంది. అలా 2021 లో జరిగిన క్రైమ్‌ వార్షిక నివేదికను విడుదల చేశారు .. 2019, 2020 తో పోల్చితే 2021 పోలీస్ శాఖ అన్ని విభాగాల్లో మంచి ఫలితాలు సాధించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. గతంలో పోలిస్తే పోలిస్తే ఈ ఏడాది పోలీసులుకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి .. ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 ను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ శక్తి వంచన లేకుండా పని చేసింది. కరోనా కష్ట కాలం లో విధి నిర్వహణ లో ఉన్న పోలీసులు ఐపీఎస్ అధికారులు, హోమ్ గార్డ్ ఇలా ప్రతి ఒక్కరూ వైరస్‌ బారిన పడ్డారు. ఇక పోలీసులతో పాటు పని చేసిన జర్నలిస్టులు విధినిర్వహణ లో ప్రాణాలు కోల్పోయారు .. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పోలీసులు అధికారులు , జర్నలిస్ట్ లు కొన్ని నిముషాల పాటు మౌనం పాటించారు .

తగ్గిన క్రైమ్ రేట్.. హైదరాబాద్ కమిషనరేట్ అంటేనే క్రైమ్ కి పుట్టినిల్లు.. అయితే టెక్నాలజీ ను ఉపయోగించి కేసులు పరిష్కారం కోసం ముందుకు వెళుతూ విజయవంతమవుతున్నారు పోలీసులు. రాష్ట్రంలో గత యేడాది తో పోలిస్తే ఈ ఏడాది ఫిర్యాదులు పెరిగాయి. అయితే వాటిని పరిష్కార మార్గాలు చూపుతూ పోలీసులు ముందడుగు వేయడం తో పోలీసుల పనితీరుపై ప్రశంసలు వెల్లు వెత్తాయి. ఇక కేసుల దర్యాప్తు , రికవరీలలో గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది కొద్దిగా పోలీసులు మెరుగైన ఫలితాలు సాధించారు. మహిళలు అక్రమ రవాణా , చిన్న పిల్లలతో వ్యభిచారం , దోపిడీలు, దొంగతనాలు, హత్యాయత్నాలు, వేధింపులు , సైబర్ క్రైమ్ వంటి నేరాలు రాచకొండ ను వణికించాయి. కాని గత రెండేళ్లలో పోల్చుకుంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందనే చెప్పాలి. నేరాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్షలు పడేలా ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు నిలబెడుతున్నారు పోలీసులు. 2019 లో 23 శాతం శిక్షలు పడితే , 2021 లో అది 49 శాతానికి పెరగడం గమనార్హం.

పెరిగిన రేప్ కేసులు.. కానీ మహిళలపై వేధింపులతో పాటు అత్యాచార కేసులు గతంతో పోలిస్తే పెరిగాయి. మహిళా వేధింపులకు సంబంధించి  2019 లో 2, 354 కేసులు నమోదు కాగా 2021 లో 2,393 కేసులు నమోదయ్యాయి .  ఇందులో 2019 లో 281 కేసులు ,  లాక్ డౌన్ సమయంలో 2020 లో కూడా 265 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇక 2021 వీటి సంఖ్య మరింత పెరిగింది.  328 కేసులు నమోదు కావడంతో పోలీసులు కొంత అపకీర్తి మూట కట్టుకున్నారు .  అత్యాచారానికి గురైన వారిలో ఎక్కువ మంది మైనర్ బాధితులు ఉండడం గమనార్హం. ఇక సైబర్ క్రైమ్ మినహాయిస్తే , ప్రతిరోజూ 100 నుండి ఐపీసీ కేసులు వరకు నేరాలు , ఫిర్యాదులు వచ్చాయి. అయితే టెక్నాలజీ ను ఉపయోగించి వాటిని పరిష్కరించడంలో విజయం సాధించామంటున్నారు పోలీసులు. ఇక కిడ్నాప్ కేసుల విషయానికొస్తే.. 2019 లో 95 కేసులు నమోదు కాగా 2021 లో 90 కేసులు నమోదు అయ్యాయి. మహిళలు పైన 2019 లో 1, 462 కేసులు నమోదైతే 2021 లో 1,474 కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మహిళల పై వేధింపులకు పాల్పడుతున్న వారిపై  మొత్తం 1,414 కేసులను షీ టీమ్స్ నమోదు చేసింది. వరకట్న వేధింపులతో ఆత్మ హత్య చేసుకున్న సంఘటనలకు సంబంధించి 2019 లో 22 కేసులు నమోదు కాగా , 2019 లో 19 కేసులు , 2021 లో 15 కేసులు నమోదయ్యాయి.

డ్రగ్స్‌, గాంజాపై ఉక్కుపాదం.. డ్రగ్స్, గంజాయి పై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 246 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్‌కు సంబంధించి సుమారు 600 మందిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. స్పెషల్ డ్రైవ్ లో 2,077 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక పదేపదే నేరాలకు పాల్పడుతోన్న 205 మంది నేరస్థులపై పీడీ యాక్ట్ లు నమోదు చేశారు పోలీసులు.

భారీగా పెరిగిన సైబర్ నేరాలు.. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు పెరిగాయి . ఈ ఏడాది 55 శాతం సైబర్ నేరాలు పెరిగాయని, 1,55, 260 మంది సైబర్ బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఏడాది నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు . ఈ ఏడాది లో 1,206 బ్యాంక్ అకౌంట్ లలో నిల్వ ఉన్న 80 .54 కోట్ల అక్రమ నగదును సీసీఎస్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 265 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులను జైలుకు పంపించారు. కోట్ల రూపాయలకు సంబంధించి సైబర్‌ నేరాలకు పాల్పడిన 13 మంది విదేశీయులను అరెస్ట్ చేసి జైలు కి పంపించారు. అదేవిధంగా Tepdfe యాక్ట్ కింద 23 కోట్లు విలువ జేసే 16 ప్రాపర్టీలను సీజ్ చేశారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఇక రోజు రోజుకు హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఈ ఏడాది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 70 లక్షలకు పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారీగా డ్రంకెన్‌ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 25,453 మంది మందు బాబులపై పోలీసులు కేసు నమోదుచేశారు. అదేవిధంగా10,109 మంది పై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో 206 మంది కి డ్రంకన్ డ్రైవ్ కారణంగా జైలు శిక్షలు విధించింది న్యాయస్థానం. ఒక డ్రంకెన్ డ్రైవ్ కారణంగానే 10.49 కోట్ల రూపాయలు జరిమానాలు రూపంలో పోలీసులు వసూలు చేశారు. 25 మంది డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేశారు. ఇక రోడ్డు ప్రమాదాల విషయానికొస్తే.. 2020 లో 1,843 ప్రమాదాలు జరగ్గా.. ఈ ఏడాది 1, 961 రోడ్డు ప్రమాదాలు రికార్డయ్యాయి . అంటే గతంతో పోలిస్తే ఈ ఏడాది యాక్సిడెంట్‌ కేసులు పెరిగాయి. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల కారణంగా 278 మంది మృత్యువాత పడగా, 2060 మంది క్షతగాత్రులయ్యారు. ఇక ఈ ఏడాది హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 53లక్షల మంది పై కేసులు నమోదు చేశారు పోలీసులు. ట్రిపుల్ రైడింగ్ కు పాల్పడిన 1.16 లక్షల మంది, రేసింగ్, ఓవర్ స్పీడింగ్ కు పాల్పడిన 90 వేల మంది పై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.

Also Read:

Rewind 2021: చరిత్రలో ఈ ఏడాది.. దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద ఘటనలు..

Tollywood Rewind 2021: ఈ సంవత్సరం టాలీవుడ్‌ ఇండస్ట్రీని బతికించింది ఆ ముగ్గురే..

Year Ender 2021: ప్రపంచ క్రికెట్‌లో మరుపురాని క్షణాలు.. వివాదాలే కాదు.. అరుదైన రికార్డులూ ఈ ఏడాది సొంతం..!