AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2021: ఈ ఏడాది ఎన్నికల్లో అధికార పార్టీదే హవా.. ఉప ఎన్నిక నిరాశపర్చినా.. ఎమ్మెల్సీల్లో కారుదే జోరు

ఈ ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికలు పూర్తిగా అధికార పార్టీకి ఏకపక్షంగా సాగాయి. అయితే, నాటకీయ పరిణామాల మధ్య జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ గట్టి షాక్ తగలింది.

Year Ender 2021: ఈ ఏడాది ఎన్నికల్లో అధికార పార్టీదే హవా.. ఉప ఎన్నిక నిరాశపర్చినా.. ఎమ్మెల్సీల్లో కారుదే జోరు
Telangana Elections
Balaraju Goud
|

Updated on: Dec 22, 2021 | 6:09 PM

Share

Telangana Elections 2021: ఈ ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికలు పూర్తిగా అధికార పార్టీకి ఏకపక్షంగా సాగాయి. అయితే, నాటకీయ పరిణామాల మధ్య జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ గట్టి షాక్ తగలింది. టీఆర్ఎస్‌ను వీడిన ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తరుఫున విజయం సాధించారు. దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. ఈటల తన సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై 24వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు. రెండు రౌండ్లు మినహా ప్రతిసారి ఈటలదే పై చేయి అయ్యింది. హుజురాబాద్‌ నుంచి ఈటల ఏడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బలమైన సెంటిమెంట్‌ ముందు టీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రం, ప్రచారం ఏమాత్రం పని చేయలేదు.

ఈటల రాజేందర్ కు కేసీఆర్ ప్రభుత్వానికి నడుమ ఎన్నికలన్నట్లు హుజూరాబాద్ ఉపఎన్నిక జరిగింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ముఖ్య నేతలంతా… రంగంలోకి దిగిపోయారు. ఈటల ఓటమికి కోసం నియోజకవర్గంలో గడప గడప తిరిగారు. కానీ హుజూరాబాద్ ప్రజలు ఏడోసారి కూడా ఈటలనే ఆశీర్వాదించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై మాజీ మంత్రి ఈటల.. 23,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. రాజీనామాతో.. హుజూరాబాద్ లో రాజకీయం వెడెక్కింది. ఈటలను ఎలాగైనా ఓడించాలని.. టీఆర్ఎస్ పక్కా ప్లాన్ వేసినా వర్క్ అవుట్ అవ్వలేదు. మళ్లీ హుజూరాబాద్ ప్రజలే తన బలమని ఈటల నిరూపించారు.

స్థానిక సంస్థల కోటాలోని 14 మంది ఎమ్మెల్సీలకుగాను 12 మంది పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 4న ముగియనుంది. ఇందులో పురాణం సతీశ్‌ (ఆదిలాబాద్‌), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్‌), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), వి.భూపాల్‌రెడ్డి (మెదక్‌), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), టి.భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్‌), కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు (రంగారెడ్డి) ఉన్నారు. వీరిలో వెన్నవరం భూపాల్‌రెడ్డి మండలి ప్రొటెం చైర్మన్‌గా, భానుప్రసాద్‌రావు, దామోదర్‌రెడ్డి ప్రభుత్వ విప్‌లుగా పనిచేస్తున్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గానికి గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత కేవలం 13 నెలలపాటు ఎమ్మెల్సీగా కొనసాగి పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు.

ఇక, భూపాల్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణరావు వంటివారు ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. కొద్దినెలల కింద కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన హుజూరాబాద్‌ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రివర్గం నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనపై వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్‌ తమిళిసై.. రాష్ట్ర మంత్రివర్గ ప్రతిపాదనను ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి స్థానంలో శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారిని నామినేట్‌ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ పదవులు అందుబాటులో ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్‌ ఆచితూచి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. జిల్లాలు, సామాజికవర్గాలు, కులాల వారీగా సమీకరణాలను బట్టి చాన్స్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలు, సామాజికవర్గాల నేతలు ఎవరికివారుగా తమకు అవకాశంపై లెక్కలు వేసుకుంటున్నారని పేర్కొంటున్నాయి.

లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నవంబర్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార TRS పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు స్థానాల్లో ఇవాళ పోలింగ్‌ జరిగింది. ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానిదే మెజార్టీ. అయితే క్రాస్‌ ఓటింగ్‌ భయంతో జాగ్రత్తపడింది అధికార పార్టీ. ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. కరీంనగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక చేపట్టారు. ఆరు స్థానాల్లో మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ 37 కేంద్రాలను ఏర్పాటు చేయగా… మొత్తం 5,326 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించింది. ఎన్నికల ఫలితాలు ఈ డిసెంబర్ 14న వెలువడ్డాయి.

కరీంనగర్‌‌లో‌ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఏడుగురు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌‌లో ముగ్గురు,ఆదిలాబాద్‌‌లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కు ఉన్న బలం రీత్యా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సునాయసంగా సాగింది. అయితే కరీంనగర్‌లో రెబల్ రవీందర్ సింగ్ బరిలో ఉండటం ఆ పార్టీని కాస్త కలవరపెట్టింది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం రవీందర్ సింగ్‌కు మద్దతు ప్రకటించడంతో ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందోనన్న కొంత ఆందోళన టీఆర్ఎస్‌ను వెంటాడింది. అయితే చివరికి టీఆర్ఎస్ విజయం సాధించింది.

సులువుగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ (TRS) స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ప్రత్యర్థులు గాలం వేసే అవకాశం ఉండటంతో అధికార పార్టీ అప్రమత్తంగా వ్యవహరించింది. ఎప్పుడూ లేనిది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను రిసార్టులకు తరలించింది. డిసెంబర్ 10 రోజునే వారిని నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో రిసార్టుల నుంచి వారు నేరుగా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఇందుకోసం పార్టీనే ప్రత్యేక బస్సులు, వాహనాలు సిద్ధం చేసింది. ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరగవద్దని తమ ఓటర్లకు టీఆర్ఎస్ గట్టిగా చెప్పింది. మంత్రి కేటీఆర్ సైతం స్వయంగా రంగంలోకి దిగి క్యాంపులో ఉన్న పలువురు ఎంపీటీసీ, జడ్పీటీసీలను బుజ్జగించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. నిజానికి ఎన్నికలు జరగనున్న ఐదు జిల్లాల్లో మిగతా ఏ పార్టీకి టీఆర్ఎస్‌తో పోటీ పడేంత సంఖ్యా బలం లేదు. అయినప్పటికీ తమ ఓటర్లు ఎక్కడ చేజారుతారోనన్న భయంతో టీఆర్ఎస్ పకడ్బందీగా వ్యవహరించింది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ పోలింగ్ నిర్వహించారు. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ ఓటు వేశారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటేశారు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. డిసెంబర్14వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు పెట్టి.. మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడించారు.

మొత్తం 12 స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఉమ్మడి నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కుచికుళ్ల దామోదర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ తరపున దండెం విఠల్, కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ తరపున ఎల్.రమణ, భానుప్రసాద్ రావు విజయం సాధించారు. మెదక్ జిల్లా తెరాస అభ్యర్థిగా యాదవరెడ్డి, ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు, నల్గొండ జిల్లా నుంచి టీఆర్ఎస్ తరపున కోటిరెడ్డి విజయం సాధించారు.

Read Also… Year Ender 2021: ఏపీలో ఈ ఏడాద జరిగిన ఎన్నికలు అధికార పార్టీకి ఏకపక్షం.. ఎన్నిక ఏదైనా ఫ్యాను గాలి జోరు

Follow Us