చికెన్ బిర్యానీలో బల్లి.. ‘బాగా రోస్ట్ అయిందిగా.. తినేయ్’ అన్న రెస్టారెంట్ యజమాని! చివరకు..
హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నగరంలో కొందరు రెస్టారెంట్ యజమానుల కక్కుర్తి బిర్యానీ అంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. తాజాగా ఓ హోటల్ లో చికెన్ బిర్యానీ తిన్న ఓ కస్టమర్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. మొత్తం బిర్యానీ తిన్నాక చివర్లో ప్లేట్ లో వింత ఆకారం కనిపించింది. తీరా ఏంటాని చూడగా దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది..

ఇబ్రహీంపట్నం, మే 16: రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార నాణ్యత నానాటికీ నేలచూపు చూస్తుంది. లాభాలే లక్ష్యంగా కొందరు వ్యాపారులు అపరిశుభ్రమైన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తూ వారి ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. పాచిపోయిన చికెన్, పురుగులు పట్టిన కూరగాయలు, ఏమాత్రం శుభ్రత పాటించని వంటగదిలో అత్యంత దారుణంగా రెస్టారెట్లు, హోటళ్లు భోజనం తయారు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల అధికారులు తనిఖీలు చేసి, భారీ జరిమానాలు విధించడం, అవసరమైతే హోటళ్లను మూసివేయడం వంటివి చేస్తున్నారు. అయినా వీటి తీరులో మాత్రం మార్పురావడం లేదు. తాజాగా ఓ రెస్టారెంట్ మరో దారుణానికి పాల్పడింది. కస్టమర్కి వడ్డించిన బిర్యానీలో ఏకంగా చచ్చిన బల్లి ప్రత్యక్షమైంది. ఇదేంటని ప్రశ్నించిన సదరు కస్టమర్ను ఏకంగా రెస్టారెంట్ యాజమన్యం మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ దాదాపు కొట్టినంత పనిచేశారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి గురువారం (మే 15) మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు సాగర్ రహదారిలోని మెహఫిల్ రెస్టారెంట్కు వెళ్లాడు. అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా.. కాసేపటికి సర్వర్ వచ్చి భోజనం అందించి వెళ్లాడు. ప్లేట్లోని బిర్యానీ మొత్తం తిన్న కృష్ణారెడ్డికి చివర్లో కంచంలో ఓ వింత ఆకారం కనిపించింది. ఏంటాని చూడగా.. ఆయన ఇప్పటి వరకు లొట్టలేసుకుంటూ తింటున్న చికెన్ బిర్యానీలో చచ్చిన బల్లి కనిపించింది. అంతే ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.
వెంటనే అతడు రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించాడు. అయితే సదరు యజమాని మాత్రం నింపాదిగా.. ‘ఆ ఏమైతుంది? బల్లి మంచిగా ఫ్రై అయ్యిందిగా..రుచిగా ఉంటుంది. బాగా తిను’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. పైగా ఏమి చేసుకుంటావో చేసుకోపో.. అంటూ రెస్టారెంట్ యజమాని కృష్ణారెడ్డితో మాట్లాడడం విస్తుగొలిపేలా ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోక బాధితుడు వెంటనే డయల్ 100కు ఫోన్ చేశాడు. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు.. వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. దీంతో అప్రమత్తమైన రెస్టారెంట్ యజమాని రెస్టారెంట్కు తాళం వేసి, అక్కడి నుంచి పరారయ్యాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




