తెలంగాణలో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలపై ఉన్నతస్థాయి సమీక్ష
జనవరి 8 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా, సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసన సభ మీటింగ్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.

జనవరి 8 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా, సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసన సభ మీటింగ్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రామకృష్ణ రావు, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు త్వరితగతిన అందించాలని సూచించారు. సమావేశాల సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి షిఫ్టింగ్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వరంగా చర్యలు తీసుకునేలా శాసన సభ వ్యవహారాల మంత్రి తోడ్పాటు అందించాలని అన్నారు. భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోండి, సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు చేపట్టాలని సూచించారు.
శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాలు నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు ఆయా విభాగాల అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మంత్రులు అందుబాటులో ఉండేలా చూడాలని, అసెంబ్లీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మండలి, శాసన సభకు ఎన్నికైన నూతన సభ్యులకి ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టాలని తెలిపారు.
శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ శాసన సభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు సభ్యులకు అందించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారిగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్కు సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని, గతంలో ప్రోటోకాల్ విషయంలో తాను కూడా బాధితుడిని అని మంత్రి గుర్తు చేసుకున్నారు. మండలిని అసెంబ్లీ ప్రాంగణంలో త్వరితగతిన షిఫ్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలుంటే వెంటనే పరిష్కారం చెయ్యాలని చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




