Yadadri Temple: యాదాద్రిలో 400 గదులతో లగ్జరీ హోటల్.. అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే..
లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రం సమీపంలో నాలుగు నక్షత్రాల లగ్జరీ హోటల్ ఏర్పాటుకానుంది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఆధునిక వసతులు, హంగులతో..

లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రం సమీపంలో నాలుగు నక్షత్రాల లగ్జరీ హోటల్ ఏర్పాటుకానుంది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఆధునిక వసతులు, హంగులతో లక్ష్మీనివాసం డెవలపర్స్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ సంయుక్తంగా ఈ హోటల్ను నిర్మించనున్నాయి. ఆలయానికి సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల స్థలంలో దాదాపు 400 గదులతో ఈ హోటల్ నిర్మిస్తామని లక్ష్మీనివాసం డెవలపర్స్ యజమాని రాజేంద్ర ప్రసాద్, ది పార్క్ నేషనల్ హెడ్ వికాస్ అహ్లువాలియా తెలిపారు. ఈ మేరకు హోటల్ ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం రెండు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాల మార్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టార్ హోటలైనా సామాన్యులు, మధ్య తరగతి భక్తులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉంటాయని, సుమారు 500 నుంచి 600 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.
ఆధునిక వసతులతో.. ఆధునిక వసతులు, సకల సౌకర్యాలతో ఏర్పాటుకానున్న ఈ హోటల్ వచ్చే ఏడాది మార్చి 20న ప్రారంభం కానుంది. అప్పటికి హోటల్ మొదటి దశ పూర్తవుతుందని, 2023 జులై నాటికి మొత్తం 400 గదులతో పూర్తిస్థాయి హోటల్ అందుబాటులోకి రానుంది. హోటల్లోనే ఇండోర్ స్విమ్మింగ్పూల్, ఏసీ బంకెట్ హాల్, ఏసీ జిమ్, స్పా సెంటర్లు, రెస్టారెంట్, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు ఉండనున్నాయి. అదేవిధంగా భక్తులను ఆలయం దగ్గరకు తీసుకెళ్లడానికి ఉచితంగా బస్సును కూడా ఏర్పాటు చేయనున్నారు.
Also Read:
Hyderabad: నువ్వు గ్రేట్ బ్రో.. గుడ్లగూబను దత్తత తీసుకున్న నటుడు..