AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డిజిటల్ అరెస్టు’ పేరుతో మాజీ బ్యాంక్ మేనేజర్‌కు ఉచ్చు.. రూ.1.44 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..!

డిజిటల్ అరెస్ట్.. ఇదో రకం సైబర్‌ నేరం. పీక మీద కత్తి పెట్టరు.. ఆయుధాలతో బెదిరించరు.. జస్ట్ వీడియో కాల్ చేస్తారంతే..! పుట్టుపుర్వోత్తరాలు చదువుతూ బెదరగొడతారు. అకౌంట్లలో కోట్ల రూపాయలు కాజేస్తారు. ఒకవైపు నేరగాళ్ల భరతం పడుతున్నారు పోలీసులు. అయినప్పటికీ ఏదో ఒక చోట రెచ్చిపోతున్నారు.

'డిజిటల్ అరెస్టు' పేరుతో మాజీ బ్యాంక్ మేనేజర్‌కు ఉచ్చు..  రూ.1.44 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..!
Cyber Fraud
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 11:34 AM

Share

డిజిటల్ అరెస్ట్.. ఇదో రకం సైబర్‌ నేరం. పీక మీద కత్తి పెట్టరు.. ఆయుధాలతో బెదిరించరు.. జస్ట్ వీడియో కాల్ చేస్తారంతే..! పుట్టుపుర్వోత్తరాలు చదువుతూ బెదరగొడతారు. అకౌంట్లలో కోట్ల రూపాయలు కాజేస్తారు. ఒకవైపు నేరగాళ్ల భరతం పడుతున్నారు పోలీసులు. అయినప్పటికీ ఏదో ఒక చోట రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌‌లో మరో వ్యక్తి మాయగాళ్ల వలలో చిక్కి నిండా మునిగిపోయాడు. ఏకంగా మాజీ బ్యాంక్ మేనేజర్ నుంచే కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.

మరొక మాజీ బ్యాంక్ మేనేజర్ డిజిటల్ అరెస్ట్ కు గురయ్యాడు. ప్రముఖ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. 76 ఏళ్ల వృద్ధుడైన ఆ వ్యక్తి మోసగాళ్ల వలలో పడి రూ.1.44 కోట్లు కోల్పోయాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జనవరి 17వ తేదీన బాధితుడికి తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తమను ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులమని పరిచయం చేసుకున్నారు మోసగాళ్లు. ఆయన ఆధార్ వివరాలు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు ఉపయోగించారని బెదిరించారు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, వెంటనే సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. ఈ క్రమంలో “డిజిటల్ అరెస్ట్”లో ఉన్నారని చెప్పి వీడియో కాల్స్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు నటించారు. కేసు నుంచి బయటపడేందుకు తాము సూచించిన ఖాతాల్లో డబ్బులు జమ చేయాలంటూ హుకుం జారీ చేశారు.

ఇలా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 19 మధ్య కాలంలో వివిధ బ్యాంక్ ఖాతాలకు మొత్తం 13 విడతల్లో రూ.1.44 కోట్లు బదిలీ చేయించుకున్నారు. డబ్బు చెల్లిస్తే తన పేరు క్లియర్ అవుతుందని, విచారణ పూర్తయ్యాక మొత్తం రీఫండ్ చేస్తామని నమ్మబలికారు. అంతేకాకుండా ఒక నకిలీ అండర్‌ టేకింగ్‌పై సంతకం చేయించి, కుటుంబ సభ్యులకు విషయం చెప్పొద్దని హెచ్చరించారు. ఇటీవల మోసగాళ్లు మరో రూ.17 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చి కుటుంబ సభ్యులతో చర్చించారు. ఆ తరువాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న ఈ తరహా మోసాలపై సైబర్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా డబ్బులు అడగదని, ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇలాంటి మోసాల బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఫైనల్‌గా ఎవరెన్ని జాగ్రత్తలు చెప్పినా.. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే చేయగలిగిందేం ఉండదు..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us