Telangana: కుమ్రం భీం జిల్లాలో భయం.. భయం.. పెద్ద పులి దాడిలో రైతు మృతి.. కొంతదూరం ఈడ్చుకెళ్లి..
మనిషి రక్తం రుచి మరిగిన పులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతోంది. ఎస్.. నిన్న ఏకంగా మనిషినే చంపేసింది. దీంతో అక్కడి ప్రజలు పులిని చూస్తే కాదు.. ఆమాట వింటేనే వణికిపోతున్నారు.
తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొలం వద్దకు వెళ్లిన రైతుపై పులి దాడి చేసింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని వాంకిడి మండలం, చౌపన్ గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామశివారులో మంగళవారం చోటుచేసుకుంది. పత్తి చేనులో పనిచేస్తున్న సిడాం భీము అనే రైతుపై పులి దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. పత్తి చేనుకు కాపాలా ఉన్న సమయంలో పెద్దపులి దాడి చేసింది. కిందపడేసి రక్తం వచ్చేలా దాడి చేసింది. కొంతదూరం పాటు ఈడ్చుకెళ్ళింది. సమీపంలో ఉన్న పశువుల కాపరులు కేకలు వేయడంతో గుట్ట సమీపంలో వదిలింది. అప్పటికే ఆ రైతు మృతిచెందాడు.
ఇప్పటి వరకు పులి సంచారంతోనే హడలెత్తిన ప్రజలు.. ఇప్పుడు ఏకంగా మనిషిపైనే దాడిచేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలంలోకి ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఘటనా స్ధలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు ఇది మహారాష్ట్ర నుండి వచ్చిన పులులుగా భావిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులులు కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్లో సంచరిస్తున్నాయి. ఈ పులులు రెండు రోజుల క్రితం ఆవుపై దాడి చేశాయి. నిన్న ఏకంగా మనిషిని చంపేశాయి.
మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి అటవీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. మూడు, నాలుగు చోట్ల పులులు కనిపించాయి. దీంతో మొత్తం ఎన్ని పులులు సంచరిస్తున్నాయో, ఎవరిపై దాడిచేస్తాయో తెలియక ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..