Boora Narsaiah Goud: అవమానిస్తున్నారు.. బీసీలకు టికెట్ అడిగితే తప్పా..? బూర నర్సయ్యగౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ఒక వైపు నేతలు ప్రచార పర్వం ముమ్మరం చేసుకుంటుంటే..
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ఒక వైపు నేతలు ప్రచార పర్వం ముమ్మరం చేసుకుంటుంటే.. మరో వైపు ఒక పార్టీ నుంచి మరో పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి. ఈ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన.. నిన్న జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపించారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన టీవీ9తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి కోసమే ఉద్యమం చేశాం.. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు.. ఉద్యమం తర్వాతనే పదవిని పొందాను. ప్రజల సమస్యలను అధినేతకు చెప్పి పరిష్కారం కోసం పనిచేయడమే రాజకీయ నాయకుడి లక్ష్యం. కానీ అధినేతను కలవడానికే తెలంగాణ ఉద్యమాన్ని మించి కష్టపడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.
బీసీ అంటే బూతు పదంలా చూస్తే ఎలా?
బీసీ అంటే బూతు పదంలా చూస్తున్నారని, నన్ను అవమానించినా ఫరవాలేదు. కానీ బీసీలకు టికెట్ అడిగితే తప్పా? అని ప్రశ్నించారు. ఒక ముక్కేసి మూలన కూర్చోమంటే కూర్చోడానికి నేనేమీ పెంపుడు జంతువులం కాదు.. మునుగోడు అభ్యర్థిగా బీసీని పరిశీలించమని చెబితే ఇంతగా అవమానిస్తారా? ఏ మీటింగ్ కి పిలవరా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏనాడూ నేను పదవులు ఆశించలేదు. అపాయింట్మెంట్ కోరుతూ రాసి పంపే చిట్టీలలో నేను ఏ పదవి కోరడం లేదు అని స్పష్టంగా ప్రస్తావించేవాడిని, అయినా సరే కలవడానికి ఒప్పుకోలేదు. నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు. నా రాజీనామా నిర్ణయం తరువాత ఎంతో మంది సమర్ధించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. పేర్లు చెప్పను కానీ, నాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నన్ను బుజ్జగించాల్సిన అవసరం లేదు. బుజ్జగింపులు కోరుకోవడం లేదు. నన్ను అన్ని పార్టీలవారు సంప్రదిస్తున్నారు. నియోజకవర్గానికి వెళ్లి కార్యకర్తలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాననని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి