AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కరెంట్ చార్జీల పెంపు లేదు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్ఎంసీ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం… ఓఆర్‌ఆర్ వెంట ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేస్తూ మహానగరాన్ని మరింతగా విస్తరించింది. మరోవైపు విద్యుత్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి, మూడో డిస్కం ఏర్పాటు, అండర్‌గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, కొత్త పవర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

Telangana: కరెంట్ చార్జీల పెంపు లేదు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...
Telangana Cabinet Meeting
Ram Naramaneni
|

Updated on: Nov 25, 2025 | 5:33 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో జీహెచ్ఎంసీ విస్తరణ, విద్యుత్ రంగ సంస్కరణలు, క్రీడా, విద్య రంగ అభివృద్ధి వంటి పలు అంశాలపై కేబినెట్ విపులంగా చర్చింది.. నిర్ణయాలు తీసుకుంది.

1. మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం: హైదరాబాద్ పట్టణీకరణ వేగం పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని పరిసర ప్రాంతాలను ఒకే పట్టణ పరిపాలన కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెంట ఉన్న 27 మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీతో విలీనం కానున్నాయి. పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్ జీహెచ్ఎంసీలో వీలినం అవ్వనున్నాయి. విలీనం తర్వాత.. జీహెచ్ఎంసీ పరిధి భారీగా విస్తరించనుంది. జనాభా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాంతాలకు అదనపు నిధులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌరసేవల విస్తరణకు అవకాశాలు ఉంటాయి.

2. విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలు: రాష్ట్రంలోని పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్, డిస్కంల నష్టాల నేపథ్యంలో క్యాబినెట్ ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న TSSPDCL, TSNPDCL పై పేరుకుపోయిన రూ. 59,671 కోట్ల నష్ట భారం తగ్గించేందుకు ప్రభుత్వం జనవరి 2026 కల్లా మూడో డిస్కంను ఏర్పాటు చేయనుంది. మెట్రో వాటర్ బోర్డు వంటి రంగాలకు విద్యుత్ సరఫరా బాధ్యతలను ఈ కొత్త డిస్కం తీసుకోనుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మాత్రం ప్రస్తుత డిస్కంలదే.

3. సోలార్ & థర్మల్ ప్రాజెక్టులకు గ్రీన్ లైట్: రాష్ట్రంలో 3,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం టెండర్లు ఆహ్వానించనున్నారు. అదే విధంగా రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఆమోదం లభించింది. పాల్వాంచ, మక్తల్ ప్రాంతాల్లో కొత్త ప్లాంట్ల అవకాశాలు పరిశీలించనున్నారు. కొత్త పరిశ్రమలు తమకావసరమైన విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

4. హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ కేబుల్ సిస్టమ్: వర్షాలు, గాలివానల సమయంలో విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు హైదరాబాద్‌ను మూడు సర్కిళ్లుగా విడగొట్టి పూర్తి భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇది అమల్లోకి వస్తే.. విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయి. నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. టీ–ఫైబర్ కేబుళ్లను కూడా ఇదే సమయంలో ఏర్పాటు చేయనున్నారు.

5. విద్య, క్రీడా రంగాలకు ఉత్సాహకర నిర్ణయాలు: ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో.. యంగ్ ఇండియా ఇన్‌టిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 20 ఎకరాల భూమి కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కాగా కరెంట్ చార్జీల పెంపు ఉండదని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. డిస్కంల నుంచి కరెంట్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదన మా వద్దకు రాలేదని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us