Telangana: విజయ సంకల్ప యాత్రకు సిద్దమైన బీజేపీ.. ప్రచారబరిలోకి అప్పటి నుంచే..
లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సంకల్ప యాత్రలకు సిద్దమైంది. ఉమ్మడి ఆదిలాబాద్లోని రెండు ఎంపి స్థానాల్లో విజయమే లక్ష్యంగా కొమురంభీం విజయ సంకల్ప యాత్ర పేరిట శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 20న ఉదయం బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆశీస్సులతో యాత్రను ప్రారంభించి ఐదు రోజులు, నాలుగుజిల్లాలు, ఆరుబహిరంగ సభలు, ఎనిమిది రోడ్ షోలతో ప్రధాన పార్టీల కంటే ముందే పార్లమెంట్ ఎన్నికల కదనరంగంలోకి దిగుతోంది బీజేపీ.

లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సంకల్ప యాత్రలకు సిద్దమైంది. ఉమ్మడి ఆదిలాబాద్లోని రెండు ఎంపి స్థానాల్లో విజయమే లక్ష్యంగా కొమురంభీం విజయ సంకల్ప యాత్ర పేరిట శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 20న ఉదయం బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆశీస్సులతో యాత్రను ప్రారంభించి ఐదు రోజులు, నాలుగుజిల్లాలు, ఆరుబహిరంగ సభలు, ఎనిమిది రోడ్ షోలతో ప్రధాన పార్టీల కంటే ముందే పార్లమెంట్ ఎన్నికల కదనరంగంలోకి దిగుతోంది బీజేపీ. రేపు బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రారంభంకాబోతున్న బీజేపీ విజయసంకల్ప యాత్ర ముథోల్ నియోజకవర్గం నుండి మొదలై ఐదు రోజులు 500 కిలో మీటర్లు ప్రయాణించి మంచిర్యాల నియోజకవర్గంలో ముగియనుంది. కొమురంభీం క్లస్టర్లో భాగంగా సాగనున్న బీజేపీ విజయసంకల్ప సభను సక్సెస్ చేయడానికి బీజేపీ శ్రేణులను ఇప్పటికే సిద్దం చేసింది కాషాయ అధిష్టానం.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ప్రధాన పార్టీల కంటే ముందే ఎన్నికల కదనరంగంలోకి దిగింది. ఉమ్మడి ఆదిలాబాద్లోని 10 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటు బ్యాంక్ను పెంచుకున్న కాషాయ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోను మరింత ముందుకు దూసుకెళ్లి రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 20 నుండి విజయ సంకల్ప యాత్ర పేరిట కొమురంభీం క్లస్టర్లో భాగంగా బాసర అమ్మవారి ఆశీస్సులతో యాత్రను షురూ చేయబోతోంది. ఈయాత్రను పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ బాసర ఆలయం నుండి ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఐదు రోజుల పాటు ఈ యాత్ర చేపట్టనున్నారు.
కాషాయ సెంటిమెంట్.. బాసర అమ్మ దీవెనలతో
తొలి రోజు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభం కానున్న కొమురంభీం క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర బైంసాలో తొలి బహిరంగ సభతో లోక్ సభ ఎన్నికల శంఖరావాన్ని పూరించనుంది. ఈ బహిరంగ సభకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ హాజరుకానున్నారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ నేతృత్వంలో తొలి రోజు యాత్ర సాగనుంది. బైంసాలో బహిరంగ సభ పూర్తికాగానే తొలి రోజు 84 కిలో మీటర్లు సాగి ముధోల్ నియోజకవర్గం నుండి నిర్మల్ నియోజక వర్గానికి చేరుకోనుంది. తొలి రోజు ముధోల్ నియోజకవర్గంలోని బాసర, బైంసా, కల్లూర్, నర్సాపూర్, దిల్వార్ పూర్ మీదుగా సాగనున్న యాత్ర ఈనెల 20 సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోనుంది.
రెండవ రోజు నిర్మల్ నుండి ప్రారంభమై వెయ్యుఉరుల మర్రి నుండి నేరడిగొండ , ఇచ్చోడ , గుడిహత్నూర్ మీదుగా ఆదిలాబాద్కు చేరుకోనుంది. రెండవ రోజు వెయ్యి ఉరుల మర్రి వద్ద రోడ్ షో , నిర్మల్లో రోడ్ షో ఆదిలాబాద్లో బహిరంగ సభతో రెండవ రోజు విజయ సంకల్ప యాత్ర ముగియనుంది. ఫిబ్రవరి 22న మూడవ రోజు యాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుండి మొదలైన విజయసంకల్ప యాత్ర కెస్లాపూర్ మీదుగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్కు చేరుకోనుంది. ఉట్నూర్లో రోడ్ షో అనంతరం జైనూర్, కెరమెరి మీదుగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. మూడవ రోజు ఉట్నూర్, జైనూర్, ఆసిపాబాద్లలో రోడ్ షోలతో యాత్ర సాగనుంది. నాలుగవ రోజులో కాగజ్నగర్లో బహిరంగ సభ నిర్వహించనుండగా.. 55 కిలో మీటర్లు ప్రయాణించి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని బెల్లంపల్లి నియోజకవర్గంలోకి కొమురంభీం క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర ఎంట్రీ ఇవ్వనుంది. నాలుగవ రోజు బెల్లంపల్లి, మందమర్రిలో రోడ్ షోలు నిర్వహించనున్న బీజేపీ ఐదవ రోజు మంచిర్యాల లో భారీ బహిరంగ సభకు ఫ్లాన్ చేసింది. ఈ యాత్రకు ఇంఛార్జ్ పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ ఇంఛార్జ్ రాహుల్ రాంనాథ్ వ్యవహరిస్తుండగా ఉమ్మడి ఆదిలాబాద్లో 500 కిలో మీటర్లు ఈ యాత్ర సాగనుంది. తొలిరోజు అస్సాం సీఎంతో ప్రారంభమై చత్తీస్గఢ్ సీఎంతో ఈనెల 25 న ఉమ్మడి ఆదిలాబాద్లో పర్యటన ముగియనుంది.
బైంసాలో తొలి బహిరంగ సభ
బైంసాలో వ్యూహాత్మకంగా ఈ బహిరంగ సభను నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను జనానికి వివరించనున్నారు. అలాగే జాతీయ, రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, అప్పటి బీఆర్ఎస్ వైఫల్యాలను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు జనాలకు చెప్పనున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడున్నర రోజులపాటు.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్లోని మూడు నియోజక వర్గాల్లో, మరో రెండు రోజుల పాటు ఈ యాత్రను కొనసాగనుంది. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేపడుతున్న సంకల్ప యాత్ర కావడంతో ఈ యాత్రను దిగ్విజయం చేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్దమయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








