AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రెండు నెలల్లోనే మారిన సీన్.. తిరిగి సొంత గూటికి చేరిన కీలక నేత..

Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు  వేగంగా మారుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన యాదాద్రి-భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు మాపో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే రెండు నెలలు కాకముందే ఆయన సొంతగూటికి వస్తుండడంతో భువనగిరి కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Telangana: రెండు నెలల్లోనే మారిన సీన్.. తిరిగి సొంత గూటికి చేరిన కీలక నేత..
Telangana Congress
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 25, 2023 | 11:22 PM

Share

Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు  వేగంగా మారుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన యాదాద్రి-భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు మాపో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే రెండు నెలలు కాకముందే ఆయన సొంతగూటికి వస్తుండడంతో భువనగిరి కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి చేతిలోఓడిపోయారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరుడిగా కుంభం అనిల్ రెడ్డి యాదాద్రి డిసిసి అధ్యక్షుడిగా కొనసాగారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు.

ఈ క్రమంలోనే ఆయన ఈ ఏడాది జూలై 24న ప్రగతి భవన్‌లో, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనిల్ కుమార్‌తో పాటు ఆయన ముఖ్య అనుచరులు  కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే గత నెలలో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కేసీఆర్.. భువనగిరి నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికే మరోమారు అవకాశం ఇచ్చారు. అయితే ఈ పరిణామాలతో కుంభం అనిల్ తీవ్ర అసంతృప్తి చెందినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని మనస్థాపం చెందారట. తాను ఆశించిన పదవి కూడా గులాబీ పార్టీలో దక్కడం కష్టమేనని భావించారట. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి కుంభం అనిల్ తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం సాగింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారట. ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కుంభం అనిల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత కొద్ది రోజుల క్రితం బిజెపికి రాజీనామా చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జిట్టా భువనగిరి కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్నారు. తన నియోజకవర్గం లోని భువనగిరి అసెంబ్లీ స్థానానికి జిట్టా బాలకృష్ణారెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఎంపీ కోమటిరెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ సొంత గూటికి చేరేందుకు కుంభం అనిల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండడంతో కోమటిరెడ్డికి గిట్టడం లేదు. అనిల్ కుమార్ రెడ్డికి అధిష్టానం వద్ద మంచి పేరుందని రేవంత్ వివరణ ఇచ్చారట. కుంభం అనిల్ రెడ్డికి పిసిసి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా ఉంది. అనిల్ కుమార్ రెడ్డికి భువనగిరి కాంగ్రెస్ టికెట్ కోసం రేవంత్, ఉత్తమ్ మద్దతు పలుకుతుండగా జిట్టా బాలకృష్ణారెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి మద్దతు ఇస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్ సీటు ఎవరికి ఇస్తారనేది క్యాడర్ అయోమయంలో పడింది. దీంతో భువనగిరి కాంగ్రెస్ రాజకీయం మరింత రసకందాయంలో పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..