AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WORLD CUP: టీ20 ప్రపంచ కప్ లో భారత్ కు ఆందోళన కలిగిస్తున్న ప్రధాన అంశాలు ఇవే..

స్వదేశీ గడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో వరుసగా జరిగిన టీ20 సిరీస్ లో విజయం సాధించి అక్టోబర్ నెలలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ లో అడుగుపెడుతున్న భారత్ ను ప్రధానంగా కొన్ని అంశాలు ఇబ్బందిగా మారాయి. టీ20 ప్రపంచకప్ గెలవాలనే ధృడనిశ్చయంతో భారత్ ఉంది. ఆస్ట్రేలియా..

T20 WORLD CUP: టీ20 ప్రపంచ కప్ లో భారత్ కు ఆందోళన కలిగిస్తున్న ప్రధాన అంశాలు ఇవే..
Team India
Amarnadh Daneti
|

Updated on: Oct 05, 2022 | 10:08 PM

Share

స్వదేశీ గడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో వరుసగా జరిగిన టీ20 సిరీస్ లో విజయం సాధించి అక్టోబర్ నెలలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ లో అడుగుపెడుతున్న భారత్ ను ప్రధానంగా కొన్ని అంశాలు ఇబ్బందిగా మారాయి. టీ20 ప్రపంచకప్ గెలవాలనే ధృడనిశ్చయంతో భారత్ ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై సిరీస్ గెల్చుకున్నప్పటికి కొన్ని అంశాలు మాత్రం భారత క్రికెట్ జట్టుకు ఆందోళనకరంగా మారాయి. మంచి బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికి.. డెత్ బౌలింగ్ టీమిండియాకు ఆందోళనకరంగా మారింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నమెంట్ నుండి దూరం కావడంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికైతే ఈ విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం జట్టుకు ఇబ్బందికలిగిస్తున్న ప్రధాన అంశాలను ఎలా పరిష్కరించుకుంటారనేది అందరిముందున్న ప్రశ్న. ఒక వేళ హార్థిక్ పాండ్యా కూడా ఏదైనా గాయం కారణంగా మ్యాచ్ కు అందుబాటులో లేకపోతే జట్టులో సమతుల్యత దెబ్బతింటుంది. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారనేది కూడా ప్రశ్నగానే మిగిలిపోనుంది. ప్రస్తుతం జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్యలను చూసుకుంటే..

జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరు

ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమవడంతో టీమ్ ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఈస్థానంలో ఎవరినీ ప్రకటించలేదు. మహ్మద్ షమీ, దీపక్ చాహర్ లు స్టాండ్ బై ఆటగాళ్లుగా ఉన్నారు. అయితే వీరిద్దరూ ఈఏడాది టీ20 ఫార్మట్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడలేదు. గతంలో ఐపీఎల్ ఆడినప్పటికి, రీసెంట్ గా పరిమిత ఓవర్ల మ్యాచుల్లో ఎక్కువ ఆడకపోవడం కొంత ఆందోళన కలిగించే అంశమే. దీపక్ చాహర్ దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్ లో ఆడాడు. మొదటి రెండు మ్యాచుల్లో బాగానే బౌలింగ్ చేశాడు. మూడో మ్యాచ్ లో మాత్రం భారీగా పరుగులను సమర్పించుకున్నాడు. మరోవైపు మహ్మద్ షమీ ఈ ఏడాది భారత్ తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ కోసం జట్టులో స్థానం సంపాదించినప్పటికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఈ రెండు సిరీస్ లనకు దూరమయ్యాడు. అయితే మహ్మద్ సిరాజ్ కూడా ఓ అవకాశంగా ఉన్నాడు. అయితే బీసీసీఐ బూమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.

డెత్ బౌలింగ్ సమస్య

ఆసియా కప్ తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లలో భారత బౌలర్లు డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులను సమర్పించుకున్నారు. భువనేశ్వర్ కుమార్ , హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ కూడా డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చేశారు. చివరి ఓవర్లలో యార్కర్ బాల్స్ వేయడంలో ఈ బౌలర్లు ఆకట్టుకోలేకపోయారు. దీంతో డెత్ ఓవర్ల సమస్యను టీ20 ప్రపంచకప్ నాటికి ఎలా అధిగమిస్తారనేది చాలా కీలకంగా మారింది.

ఇవి కూడా చదవండి

హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం

టీ20 ఫార్మట్ లో హార్థిక్ పాండ్యా తన ఆల్ రౌండర్ ప్రతిభతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. బ్యాటింగ్ తో పాటు, బౌలింగ్ లో కూడా తాను సత్తా చాటుతున్నాడు. ఒకవేళ హార్దిక్‌ పాండ్యాకు గాయమైతే అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారనేది కూడా పెద్ద ప్రశ్నగానే మిగిలిపోనుంది. పాండ్యా గనుక గాయం కారణంగా జట్టుకు దూరమైతే టీమ్ యొక్క సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుంది. పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడం భారత క్రికెట్ జట్టుకు ఆందోళన కలిగించే అంశమే.

రిషబ్ పంత్ ఎలా రాణిస్తాడు

రిషబ్ పంత్ గనుక ఫామ్ లోకి వస్తే అతను బ్యాటింగ్ తో బీభత్సం సృష్టించగలడు. అయితే టీ20 ఫార్మట్ లో ఇటీవల కాలంలో తాను పెద్దగా రాణించలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ తుది జట్టులో స్థానం లభించినప్పటికి.. మొదటి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. చివరి టీ20 మ్యాచ్ లో ఓపెనర్ గా దిగి 14 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్ రాణిస్తుండటంతో పంత్ ను ఓపెనింగ్ కు పంపే ఛాన్స్ లు తక్కువ. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్ ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. దీంతో అతని ఫామ్ కూడా జట్టుకు ఒకింత ఆందోళన కలిగించే అంశమే.

యుజ్వేంద్ర చాహల్‌కు సవాల్

లెగ్-స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఆస్ట్రేలియా గడ్డపై బాగా రాణిస్తాడనే విశ్వాసం ఉన్నప్పటికి, ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లో చాహల్ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. పెద్దగా వికెట్లు కూడా లేవు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ లో చాహల్ ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో చాహల్ కు ప్లేయింగ్ లెవన్ లో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్స్ ఉండటంతో రవిచంద్ర అశ్విన్ కు అవకాశం కల్పించారు. మొత్తం మీద చాహల్ ప్రదర్శన ఎలా ఉంటుందనేదానిపై కూడా జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

Follow Us