ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ ‘ప్లాన్ బి’.. అదేంటంటే?
Iran conflict impact on ICC T20 World Cup: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రస్తుతం భారత్, శ్రీలంక వేదికగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ప్రపంచ రాజకీయ పరిణామాలు క్రీడలపై కూడా ప్రభావం చూపగలవన్న విషయం మరోసారి స్పష్టమైంది.

Iran Conflict Impact on T20 World Cup: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీసీ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్పై భారీ దాడులు ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలను తమ భవితవ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొంటున్న ఆటగాళ్లు, అధికారులు తిరిగి స్వదేశాలకు వెళ్లే ప్రయాణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రత్యామ్నాయ విమాన ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఐసీసీ అధికారిక ప్రకటన..
ఐసీసీ శనివారం విడుదల చేసిన ప్రకటన మేరకు.. “మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితులను మేం సమగ్రంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం భారత్, శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులు, ఇతర భాగస్వాముల ప్రయాణ, లాజిస్టిక్స్, భద్రత కోసం పూర్తి స్థాయి కాంటిజెన్సీ ప్లాన్ను అమలు చేశాం” అని పేర్కొంది. అంటే అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు ఏర్పాటు చేసే విధంగా ‘ప్లాన్ బి’ సిద్ధంగా ఉంచింది.
ప్రయాణాలపై ప్రభావం..?
మధ్యప్రాచ్య గగనతలం మీదుగా అనేక అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తుంటాయి. ఇరాన్ పరిసరాల్లో ఉద్రిక్తతలు పెరిగితే విమాన మార్గాల్లో మార్పులు రావచ్చు. దీని వల్ల ఆటగాళ్లు, జట్టు అధికారులు, బ్రాడ్కాస్ట్ సిబ్బంది ప్రయాణాలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది.
అయితే టోర్నమెంట్ నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయి.
భద్రతకు ప్రాధాన్యం..
ఐసీసీ మేరకు పాల్గొనే అన్ని వర్గాల భద్రతే తమ మొదటి ప్రాధాన్యం అంటూ ప్రకటించింది. పరిస్థితులు ఎలా మారినా, ముందస్తు ప్రణాళికలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
