Vaibhav Sooryavanshi : విమర్శకుల నోళ్లు మూయించిన యంగ్ సెన్సేషన్.. వైభవ్ సూర్యవంశీ పై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi : జింబాబ్వే సిరీస్లో 151 పరుగులతో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీపై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతని పరిణతి, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం అసాధారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో భారత క్రికెట్కు అతడు పెద్ద ఆస్తి అవుతాడని అభిప్రాయపడ్డారు.

Vaibhav Sooryavanshi : భారత తాత్కాలిక ప్రధాన కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. జింబాబ్వే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో భారత్కు 3-0తో విజయాన్ని అందించిన వైభవ్ పరిణతిని ఆయన కొనియాడారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో ఆటను అర్థం చేసుకునే వైభవ్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేవలం 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, అతనిలో పెరుగుతున్న మానసిక పరిణతి అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంలోనే ఒత్తిడితో కూడిన పరిస్థితులను అధిగమించడానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు. జింబాబ్వే పర్యటనలో తన విమర్శకులకు బ్యాట్తోనే గట్టి సమాధానమిస్తూ వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు.
జింబాబ్వేపై 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్
జింబాబ్వేతో జరిగిన మూడో, చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గానూ అతను చివరి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు సిరీస్ మొత్తానికి గానూ ప్లేయర్ ఆఫ్ ది సీరిస్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. “అందరికంటే నన్ను బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే ఒక వ్యక్తిగా అతను ఎదిగిన విధానం. గత ఆరు నెలల్లో అతని పరిణతి, మ్యాచ్ను అర్థం చేసుకునే తీరు, అవగాహన అద్భుతంగా పెరిగాయి. అందుకే అతను కఠినమైన పరిస్థితులను కూడా ఎంతో సులువుగా నెట్టుకొస్తున్నాడు” అని కొనియాడారు.
ఇంగ్లాండ్ పర్యటన నిరాశ నుంచి జింబాబ్వేలో రికార్డుల రచ్చ
ఈ సిరీస్లోని మూడు ఇన్నింగ్స్ల్లో వైభవ్ 50.33 సగటుతో మొత్తం 151 పరుగులు సాధించాడు. చివరి మ్యాచ్లో అతను ఆడిన 81 పరుగుల వినాశకర ఇన్నింగ్స్ భారత్ విజయానికి ప్రధాన పునాదిగా నిలిచింది. అంతకుముందు ఇంగ్లాండ్ పర్యటనలో అతను 13, 14, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దాంతో ఆఖరి టీ20 మ్యాచ్ నుంచి కూడా తుది జట్టు నుంచి వైదొలిగాడు. ఆ సిరీస్ను భారత్ 0-4 తేడాతో కోల్పోయింది. అయితే ఆ నిరాశ నుంచి వెంటనే కోలుకుని జింబాబ్వే గడ్డపై అసాధారణ రీతిలో పుంజుకున్న తీరును లక్ష్మణ్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఐపీఎల్ అనుభవం, అంకితభావం
ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్కు విశ్రాంతి ఇవ్వడంతో ఈ పర్యటనకు భారత జట్టు బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్ మాట్లాడుతూ.. “వైభవ్ అండర్-19 ప్రపంచ కప్ ఆడాడు, ఆ తర్వాత నాలుగైదు నెలల్లోనే ఐపీఎల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ ఐపీఎల్ స్థాయి మ్యాచ్లను తట్టుకోవడం ఎంత కష్టమో మనకు తెలుసు. అటువంటి వేదికపై తట్టుకుని, అంతర్జాతీయ క్రికెటర్గా ఎదగడం అతని అపారమైన ప్రతిభకు నిదర్శనం” అని అన్నారు. అంతేకాకుండా ఫీల్డింగ్ సమయంలో చిన్నపాటి గాయమైనప్పటికీ మైదానంలోనే ఉండి జట్టుకు తోడ్పడాలని వైభవ్ ఆరాటపడ్డాడని, అయితే ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపామని లక్ష్మణ్ తెలిపారు. 15 ఏళ్ల వయసులోనే జట్టు కోసం ఏదైనా చేయాలనే అతని తపన అభినందనీయమని కోచ్ అన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
