Abhishek Sharma : సూర్యకుమార్ యాదవ్ క్లాస్ కామెంట్.. కుంగిపోయిన అభిషేక్ శర్మకు అదిరిపోయే స్ఫూర్తి
Abhishek Sharma : జింబాబ్వే సిరీస్ లో వరుస వైఫల్యాలతో నిరాశలో ఉన్న అభిషేక్ శర్మకు సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. "ఇది కేవలం చెడు దశ మాత్రమే, మళ్లీ బలంగా తిరిగొస్తావు" అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టు కుంటున్నాయి.

Abhishek Sharma : భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసినప్పటికీ అభిషేక్ శర్మ వ్యక్తిగతంగా ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి అతను కేవలం 11 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. ఇదే సమయంలో అతనితో పాటు ఓపెనర్గా వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 151 పరుగులతో సిరీస్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలవగా, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 146 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. తన వైఫల్యం పట్ల తీవ్ర తీవ్ర నిరాశకు గురైన అభిషేక్ శర్మ ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ పోస్ట్ చేస్తూ, మళ్లీ బలంగా పుంజుకుంటానని అభిమానులకు మాటిచ్చాడు.
బాధగా ఉంది కానీ మరింత బలంగా తిరిగొస్తా
తన పట్ల ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉందని అభిషేక్ శర్మ తన పోస్ట్లో పేర్కొన్నాడు. “మీ నుంచి ఎక్కువ ఆశించే వారికి మీరు అనుకున్నది ఇవ్వలేకపోయినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. కానీ కష్టపడే వారికి ఈ ఆట ఎప్పుడూ సరైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరింత బలంగా మళ్లీ తిరిగొస్తాను” అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.
ధైర్యం చెప్పిన సూర్యకుమార్ యాదవ్
కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా నిలిచే అలవాటున్న మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ బయట నుంచి అభిషేక్కు పూర్తి మద్దతు తెలిపాడు. అభిషేక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై సూర్య స్పందిస్తూ.. “గడిచిన రెండేళ్లుగా నువ్వు దేశానికి ఎన్నో నవ్వులను, సంతోషాలను అందించావు. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో భారత్కు గర్వకారణంగా నిలిచావు. ఇది కేవలం సమయం మాత్రమే, మళ్లీ మంచి రోజులు వస్తాయి. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు” అంటూ ఎంతో స్ఫూర్తిదాయకమైన కామెంట్ చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు.
View this post on Instagram
మూడో టీ20 మ్యాచ్ సమ్మరీ
సిరీస్లోని మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి సెంచరీకి కాస్త దూరంలో ఆగిపోయాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 27, రింకూ సింగ్ 25 పరుగులు చేశారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్ 54 పరుగులు చేయగా, భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సీరిస్ అవార్డులు లభించాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
