Womens World Cup Trophy : టీమిండియాకు ఇచ్చింది ఒరిజినల్ వరల్డ్ కప్ ట్రోఫీ కాదా ? అది డమ్మీనా ?
భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఈ చారిత్రక విజయం తర్వాత భారత ఆటగాళ్లకు మెరిసిపోతున్న ప్రపంచకప్ ట్రోఫీని బహూకరించారు.

Womens World Cup Trophy : భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఈ చారిత్రక విజయం తర్వాత ఆటగాళ్లకు మెరిసిపోతున్న ప్రపంచకప్ ట్రోఫీని బహూకరించారు. అయితే, క్రికెట్ అభిమానులకు ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత జట్టుకు అప్పగించిన ఈ అసలు ట్రోఫీని కొద్దిసేపటికే వెనక్కి తీసుకుంటారు. దీనికి కారణం ఐసీసీ నిబంధనలే. ఐసీసీ టోర్నమెంట్లలో అసలైన ట్రోఫీని విజేత జట్టు ఎందుకు ఇవ్వదు ? దానికి బదులుగా ఏమి ఇస్తారు? ఆ వివరాలు ఈ వార్తలో చూద్దాం.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ఐసీసీ టోర్నమెంట్ను గెలిచినా విజేత జట్టుకు అసలైన ట్రోఫీని శాశ్వతంగా ఇవ్వరు. బహుమతి ప్రదానోత్సవం, ఫోటో సెషన్ తర్వాత, అసలు ట్రోఫీని తిరిగి ఐసీసీకి అప్పగించాలి. దీనికి బదులుగా విజేత జట్టుకు డమ్మీ ట్రోఫీని ఇస్తారు. ఈ డమ్మీ కూడా దాదాపు అసలు ట్రోఫీ లాగే ఉంటుంది. దీని తయారీలో బంగారం, వెండి కూడా వాడతారు. ఐసీసీ 26 సంవత్సరాల క్రితమే ఈ నిబంధనను తీసుకొచ్చింది. అసలైన ట్రోఫీ దొంగతనానికి గురికాకుండా లేదా పాడవకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు. అసలైన ట్రోఫీని ఐసీసీ దుబాయ్ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు.
భారత జట్టు అందుకున్న ప్రపంచకప్ ట్రోఫీ డిజైన్, విశేషాలు చాలా ప్రత్యేకమైనవి. మహిళల ప్రపంచకప్ 2025 ట్రోఫీ బరువు 11 కిలోలు, దీని ఎత్తు దాదాపు 60 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ట్రోఫీ వెండి, బంగారంతో తయారు చేశారు. దీనికి మూడు వెండి స్తంభాలు ఉన్నాయి. అవి స్టంప్స్, బెయిల్స్ ఆకారంలో ఉంటాయి. పైభాగంలో రౌండ్గా బంగారంతో చేసిన గ్లోబ్ ఉంటుంది. ఈ ట్రోఫీపై ఇప్పటివరకు ప్రపంచకప్ గెలిచిన జట్ల పేర్లు చెక్కి ఉంటాయి. ఈసారి మొదటిసారిగా భారత్ పేరు కూడా ట్రోఫీపై చేరింది. ఇప్పటివరకు జరిగిన 13 ప్రపంచకప్ ఎడిషన్లలో ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ ఒకసారి, భారత్ ఒకసారి టైటిల్ను గెలుచుకున్నాయి.
హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. నవీ ముంబైలో జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 298 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులకే ఆలౌట్ అయింది. ఫైనల్లో షఫాలీ వర్మ అత్యధికంగా 87 పరుగులు చేసి, రెండు వికెట్లు కూడా పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. దీప్తి శర్మ కూడా 58 పరుగులతో పాటు, 5 కీలక వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వాల్వార్ట్ 101 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయింది.




