Champions Trophy 2002: భారత క్రికెట్ చరిత్రలో 2 దరిద్రపు రోజులు! లంక రెండు సార్లు బ్యాటింగ్ చేస్తే.. ఇండియా 10.4 ఓవర్లే ఆడింది!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గతంలో జరిగిన 8 ఛాంపియన్స్ ట్రోఫీల్లో టీమిండియా చరిత్ర గురించి తెలుసుకుందాం.. మొత్తం1998 నుంచి 2017 వరకు మొత్తం ఎనిమిది సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది ఐసీసీ. వీటిలో టీమిండియా రెండు సార్లు ఛాంపియన్గా నిలిచింది. 2013లో ధోని కెప్టె్న్సీలో కప్పు గెలిచిన టీమిండియా, 2002లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో, శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచింది.

నిజానికి 2002తో కప్పు టీమిండియాదే కానీ, అప్పుడు మన టీమ్కు వర్షం శనిలా పట్టుకుంది. రెండు సార్లు గెలవాల్సిన మ్యాచ్లో వర్షం వచ్చి అడ్డు పడింది. 2002లో జరిగిన ఫైనల్లో శ్రీలంక జట్టు రెండు సార్లు 50, 50 ఓవర్లు ఆడి బ్యాటింగ్ చేసింది. కానీ, టీమిండియా మాత్రం మొత్తం కలిపి 10.4 ఓవర్లే బ్యాటింగ్ చేసింది. అసలు 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జరిగిన డ్రామా గురించి తెలుసుకుంటే.. వామ్మో మన టీమ్తో వరుణుడు ఇంత దారుణంగా ఆడుకున్నాడా? అనిపిస్తుంది. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాస్టర్ మైండ్తో జట్టును రెండు సార్లు పటిష్టస్థితిలో నిలిపినా.. వర్షం కారణంగా టీమిండియా సింగిల్ విన్నర్ కాలేకపోయింది. అసలు ఆ ఫైనల్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుందా..
శ్రీలంక వేదికగా 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. ఆ టైమ్లో శ్రీలంక టీమ్ సూపర్ స్ట్రాంగ్గా ఉంది. జయసూర్య, ఆటపట్టు లాంటి సీనియర్ ప్లేయర్ల, కుమార సంగాక్కర, మహేల జయవర్దనే లాంటి యంగ్ ప్లేయర్లతో లంక పటిష్టంగా ఉంది. అప్పటికే 1996లో వరల్డ్ కప్ గెలిచి.. వన్డే ఫార్మాట్లో స్ట్రాంగ్ టీమ్గా ఎదిగింది. గ్రూప్ స్టేజ్లో అద్భుత ప్రదర్శనతో పాటు సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. మరోవైపు దాదా కెప్టెన్సీలో టీమిండియా సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్ మ్యాచ్ ఎలాగో తమ హోంగ్రౌండ్లోనే కావడంతో శ్రీలంకకు కాస్త అడ్వాంటేజ్గా ఉంది. కానీ, టీమిండియాను నడిపిస్తుంది గంగూలీ అనే విషయం వాళ్లు అప్పటికింకా అర్థం కాలేదు.
అప్పటి శ్రీలంక కెప్టెన్ సనత్ జయసూర్య టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సొంత గ్రౌండ్లో, భారీ అభిమాన సందోహం మధ్య బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక చెలరేగి బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు జయసూర్య 74, ఆటపట్టు 34, సంగాక్కర 54 పరుగులతో మంచి ఇన్నింగ్స్లు భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. కానీ, గంగూలీ అద్బుతంగా బౌలింగ్ మార్పులు చేసి, భజ్జీని రైట్ టైమ్లో దింపి.. శ్రీలంక స్పీడ్కు బ్రేకులు వేశాడు. భారీ స్కోర్ చేస్తుంది అనుకున్న లంక భజ్జీ దెబ్బకు 244 పరుగులకే పరిమితం అయింది. వెంటనే టీమిండియా బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ వచ్చి రావడంతోనే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరంభంలోనే మూడు బౌండరీలు బాదాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది. కానీ, అప్పుడు ఆకాశానికి చిల్లు పడినట్లు హోరున వర్షం కురిసింది. అది ఎంతకీ ఆగకపోవడంతో ఆ రోజు మ్యాచ్ను రద్దు చేశారు.
మళ్లీ రిజర్వ్ డే నాడు మ్యాచ్ తిరిగి ప్రారంభం అయింది. ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచి కాదు. మళ్లీ ఫస్ట్ నుంచి. శ్రీలంక మళ్లీ బ్యాటింగ్కు దిగింది. పిచ్ స్లోగా ఉండటంతో గంగూలీ తెలివిగా ఆలోచింది.. ఏకంగా 36 ఓవర్లు స్పిన్నర్లోతోనే వేయించాడు. కుంబ్లే, హర్భజన్, సచిన్ స్పిన్తో లంకను కట్టిపడేశాడు. ఈ సారి లంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు మాత్రమే చేసింది. ఈ సారి లంక టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్లో జయవర్డేనే లాంటి టాలెంటెడ్ ప్లేయర్తో పాటు రస్సెల్ ఆర్నాల్డ్ ఉండటంతో ఆ మాత్రం స్కోర్ అయినా లంకకు వచ్చింది. 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ లంకను జయవర్దనే నిదానంగా ఆడుతూ ఆదుకున్నాడు. జయవర్దనే, ఆర్నాల్డ్ ఇద్దరు 173 బంతుల్లో 118 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు.
చాలా స్లోగా ఆడినా.. పిచ్ స్లోగా ఉండటం, దాదా స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించడంతో లంక బ్యాటర్లకు స్లోగా ఆడటం తప్ప వేరే మార్గం లేకపోయింది. సో మొత్తానికి నిన్నటి కంటే ఇంకా తక్కువ స్కోర్కే లంక పరిమితం అయింది. మళ్లీ ఛేజింగ్ ప్రారంభించిన టీమిండియాకు వీరేందర్ సెహ్వాగ్ మరోసారి అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఈ సారి మూడు ఫోర్లు, ఒక సిక్స్తో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ మరో ఎండ్లో మోంగియా విఫలం అయ్యాడు. మొత్తానికి 8.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది టీమిండియా. మళ్లీ వర్షం పిలవకుండానే వచ్చేసింది. దాంతో రిజర్వ్ డే కూడా వర్షార్పాణం అయిపోయింది. చేసేందేం లేక ఐసీసీ లంక, ఇండియాను సంయుక్త విజేతలుగా ప్రకటించింది. అయితే.. ఇక్కడ రిజర్వ్ డేలో మొదటి రోజు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలుపెట్టినా, లేదా రెండు సార్లు కూడా వర్షం అడ్డుపడకపోయినా టీమిండియానే ఛాంపియన్గా నిలిచి ఉండేదని క్రికెట్ నిపుణులు ఇప్పటికీ బలంగా చెబుతారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




