Vijayawada: సరస్వతీ దేవిగా దుర్గమ్మ.. తెల్లవారు జాము 2 నుంచే దర్శనాలు.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు సరస్వతీ దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా..

ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు సరస్వతీ దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో భక్తుల రద్దీ పోటెత్తింది. సరస్వతీ దేవి దర్శనం కోసం క్యూలైన్లలో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. తెల్లవారు జాము 2 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించారు. భక్తజనుల అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞాన జ్యోతి వెలిగించే జ్ఞాన ప్రదాయినీ సరస్వతి దేవిగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలానక్ష్రత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిగా అలంకరిస్తారు.
సరస్వతీ దేవిని దర్శిస్తే అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం కలుగుతుందని భక్తుల విశ్వాసం. రద్దిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఐపీలకు, వృద్దులు, వికలాంగులు ప్రత్యేక దర్శనం ఇవ్వలేమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. కాగా.. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు దుర్గమ్మ మహా లక్ష్మీ దేవిగా దర్శనమిచ్చింది. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల సంఖ్య పెరిగింది.




ఆరు రోజుల్లో నాలుగు లక్షల మంది ఉత్సవాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఆలయానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సీఎం రాక సందర్భంగా దుర్గగుడిలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..