AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు దేశం దివాలా అంచున.. ఇప్పుడు అతిపెద్ద ఆర్ధిక శక్తిగా.! కారణం మన తెలుగు కోహినూరు పీవీ నరసింహారావు

దేశరాజధానికి పంచెకట్టు హూందాతనాన్ని పరిచయం చేసిన అగ్రగణ్యుడు. ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపర చాణక్యుడు. అయనే పీవీ.. మన ఠీవీ అని సగర్వంగా చెప్పుకునే భారతరత్న కిరీటాదారుడు దివంగత పాములపర్తి వెంకట నరసింహారావు.

అప్పుడు దేశం దివాలా అంచున.. ఇప్పుడు అతిపెద్ద ఆర్ధిక శక్తిగా.! కారణం మన తెలుగు కోహినూరు పీవీ నరసింహారావు
PV Narasimha Rao
K Sammaiah
| Edited By: |

Updated on: Jun 28, 2024 | 7:31 AM

Share

దేశరాజధానికి పంచెకట్టు హూందాతనాన్ని పరిచయం చేసిన అగ్రగణ్యుడు. ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపర చాణక్యుడు. అయనే పీవీ.. మన ఠీవీ అని సగర్వంగా చెప్పుకునే భారతరత్న కిరీటాదారుడు దివంగత పాములపర్తి వెంకట నరసింహారావు. రాజకీయ నాయకుడిగానే కాదు.. తన కలం ద్వారా సాహితీ వెలుగులు విరజిమ్మిన బహుభాషా కోవిదుడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921, జూన్‌ 28న రుక్మిణమ్మ-సీతారామారావు దంపతులకు తొలి సంతానంగా అమ్మమ్మ ఇంటిలో జన్మించారు.

తన ఇంటి నుంచే సంస్కరణలకు పాదు

ధనిక కుటుంబంలో పుట్టిన పీవీపై నాటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ప్రభావం చూపాయి. దాని ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నర్సింహారావు తన ఇంటి నుంచే భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పీవీ నరసింహారావు పన్నెండు వందల ఎకరాల ఆసామి. తన కుటుంబ అవసరాల కోసం 200 ఎకరాల భూమి ఉంచుకొని, మిగిలిన భూమిని పేద ప్రజలకు దానం చేసిన మహోన్నత శిఖరం. తెలంగాణలో రైతు కూలీల చేతికి కాసింత భూమి దక్కిందంటే ఆయన వేసిన భూసంస్కరణల పాదే కారణం. ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రిగా కూడా పీవీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సర్వేల్‌లో రెసిడెన్షియల్‌ స్కూల్‌ నెలకొలిపి గురుకుల విద్యకు తొలి అడుగులు వేశారు. కేంద్ర హెచ్‌ఆర్డీ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలకు అంకురార్పణ చేశారు. జైళ్ల శాఖ మంత్రిగా ఓపెన్‌ జైల్‌ అనే వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టి పక్కాగా అమలు చేశారు పీవీ.

పీవీ నరసింహారావు ప్రధాని పదవి అధిష్టించేనాటికి దేశం అర్ధికంగా అంధకారంలో కూరుకుపోయి ఉంది. 1962 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్‌ యుద్దం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. బంగారాన్ని ఇతర దేశాల బ్యాంకుల్లో తాకట్టుపెట్టి పరువు నిలుపుకోవాల్సిన దుస్థితి. క్లిష్ట సమయంలో దేశ పాలనా పగ్గాలు చేపట్టిన పీవీ.. రాజకీయాల్లోనే లేని ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థికమంత్రిని చేయడం అప్పట్లో సంచలన నిర్ణయం. మన్మోహన్‌ సింగ్‌ ద్వారా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి కారుచీకట్లు ఆవరించిన అర్థికరంగంలో వెలుగులు నింపారు. ఇవాళ ప్రపంచంలోనే భారత్‌ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వృద్ధి చెందడానికి నాడు మన పీవీ నాటిన ఆర్థికసంస్కరణ అనే మొక్కనే కారణం.

యాక్సిడెంటల్‌ ప్రధానమంత్రి

పీవీ నరసింహరావు ప్రధానమంత్రి కావడం అనేది యాక్సిడెంటల్‌గా జరిగిపోయిందని ఇప్పటికీ కాంగ్రెస్‌ వాదులు అంటూ ఉంటారు. 1991 పార్లమెంటు ఎన్నికల్లో పీవీ నరసింహారావు పోటీ నుంచి తప్పుకున్నారు. పీవీ ఇక రాజకీయ సన్యాసమనే అంతా భావించారు. అయితే నాటి ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్‌ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పీవీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అలా తన ప్రయత్నం లేకుండానే ప్రధానమంత్రి అయ్యారు పీవీ.

సాధారణంగా అందరూ ఎన్నికల తర్వాత ప్రధాని అయితే.. పీవీ నరసింహారావు విషయంలో మాత్రం అది రివర్స్‌ అయింది. ముందుగా పీవీ ప్రధాని అయిన తర్వాత ఆయన నంద్యాల లోక్‌సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పీవీ గెలుపు ఓ రికార్డ్‌గా మిగిలిపోయింది. ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతవడమే కాదు..పీవీకి 90 శాతం ఓటింగ్ నమోదు కావడం అప్పట్లో దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. పీవీ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే కాంగ్రెస్‌ ప్రయత్నం ఫలించకపోవడంతో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. పీవీ ఎన్నిక చుట్టూ, తెలుగు జాతి వైభవం, కాంగ్రెస్ పార్టీ ప్రాభవం వంటి మాటలు దేశ రాజకీయాల్లో చక్కర్లు కొట్టాయి.

1

దక్షిణ భారతానికి అదో పండగ రోజు

స్వతంత్ర భారత చరిత్రలోనే 1991 జూన్‌ 21 రోజుది ఓ మహాత్తరమైన స్థానం. తెలుగు ప్రజలకు, ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతానికే అదో పర్వదినం. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ నివాసి, తెలుగువాడు, భారతదేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంటేనే ఓ సంచలనం. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాడనే వార్తను దక్షిణభారత ప్రజలు ఎవరూ నమ్మలేకపోయారు. అంతకు ముందు 45 ఏళ్ల రాజకీయాలను పరిశీలిస్తూ వచ్చిన ప్రజలు తెలుగువాడేమిటీ ప్రధానమంత్రి కావడమేంటనీ విస్తుపోయారు. భారత ప్రధానమంత్రి పదవి ఉత్తరభారతీయులకు మాత్రమే. అందులోనూ నెహ్రూ కుటుంబానికి మాత్రమే దాని మీద వారసత్వపు హక్కు ఉందని దేశ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ముద్రపడిపోవడమే ఈ ఆశ్చర్యానికి కారణం.

రాజీవ్‌ గాంధీ మరణానంతరం ప్రధానమంత్రి పదవి సోనియా గాంధీకే ఇవ్వాలనే వాదన పార్టీలోని ఓ వర్గం మొదలు పెట్టింది. నెహ్రూ కుటుంబానికి చెందిన వారయితేనే ఈ దేశాన్ని తీర్చిదిద్దగలుగుతారని, మరెవ్వరికీ అది సాధ్యం కాదని ప్రచారం మొదలు పెట్టారు. చివరికి పీవీ నరసింహారావు పేరు ప్రకటించడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయపడినట్లయింది. ఢిల్లీ పీఠంమీద దక్షిణాదివాడా? అందులోనూ తెలుగువాడా? అంటూ హేళన చేశారు. రాష్ట్రపతి భవన్‌లో దేశ ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ప్రజలంతా టీవీలు, రేడియోలకు అతుక్కుపోయారు. అదో చారిత్రక ఘట్టం.

అనుకోకుండానే సీఎం పదవి

పీవీ నరసింహారావు దాదాపు ఏడాదిన్నర కాలం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రి పదవి కూడా ఊహించకుండానే పీవీ చేతికందింది. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆ ఉద్యమంలో పోలీస్‌ కాల్పుల్లో 369 మంది ఉద్యమకారులు చనిపోయారు. దీంతో పార్టీ హైమాండ్‌ బ్రహ్మానందరెడ్డిని తప్పించి విద్యా శాఖ మంత్రిగా ఉన్న పీవీని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.

1971 సెప్టెంబర్ 30 నుంచి 1973 జనవరి 10 వరకు పీవీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భూసంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమంతో పాటు జై ఆంధ్ర ఉద్యమం ఊపిరిపోసుకుంది. దీంతో పీవీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చింది నాటి కేంద్ర ప్రభుత్వం. భూసంస్కరణలు వ్యతిరేకించిన సీమాంధ్ర భూస్వాములు పీవీని గద్దె దించడానికి జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారనేది పలువురి వాదన.

గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రశంసలు

పీవీ నరసింహారావు ఏ పదవి చేపట్టినా తన సమర్ధతతో ఆ పదవికి వన్నె తెచ్చారు. 1962లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో పీవీ నరసింహారావు తొలిసారిగా మంత్రి అయ్యారు. పీవీకి సీఎం సంజీవరెడ్డి జైళ్ల శాఖను అప్పగించారు. జైళ్ల సంస్కరణల్లో భాగంగా తొలిసారిగా ఓపెన్ జైళ్ల విధానాన్ని తీసుకొచ్చి యావత్‌ దేశాన్ని తన వైపు చూసేలా చేశారు. ఒక్కసారిగా పీవీ పేరు జాతీయ స్థాయిలో వినిపించింది. ఆ తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైద్యశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్‌ చేయడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. అనంతరం విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన పీవీ వినూత్న విధానాలు ప్రవేశపెట్టారు.

పీవీకి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తెలుగు అకాడమీని ప్రారంభించడం, తెలుగు మీడియం ద్వారా ఉన్నత విద్య వంటి కార్యక్రమాలు విద్యాశాఖ మంత్రిగా పీవీ నరసింహారావు అమలు చేసినవే. 1988లో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో జాతీయ స్థాయి విద్యా రంగంలో అనేక సంస్కరణలకు పునాదులు వేశారు. నవోదయ విద్యాలయాలు ఏర్పాటు ఆయన హయాంలో జరిగిందే. పీవీ నరసింహారావు కేంద్రంలో హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మంత్రిగానూ పని చేసి, మన్ననలు అందుకున్నారు. ఏ పదవి చేపట్టినా అందులో అధునికతను సంతరించుకునేలా చేశారు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రపంచస్థాయి నేతలు కొనియాడేలా చేసుకున్నారు.

2

అడుగడుగనా అన్నీ అవాంతరాలే

పీవీ నరసింహారావు దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అన్నీ అవాంతరాలే. అన్నీ గడ్డు సమస్యలే. వాటినన్నింటినీ ధైర్యంతో ఎదుర్కొన్నారు. కావేరీ నదీ జలాల పంపిణీ సమస్య మద్రాసు, కర్ణాటక ప్రభుత్వాల మధ్య కురుక్షేత్రంగా మారింది. ఏమవుతుందోననే భయాందోళనలు అలముకున్నాయి. ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ, ఉద్రిక్త వాతావరణాన్ని శాంతపరిచేందుకు సుప్రీంకోర్టు తీర్పుకు సమస్యను మళ్లించి సఫలీకృతుడయ్యారు.

అయోధ్యలో మందిర్‌-మసీదు సమస్య దేశంలోనే ప్రమాదకారిగా మారింది. రావణుని కాష్టంలా మండుతూ దేశమంతా వ్యాపించింది. రోజుకు 18 గంటల పాటు విరామం లేకుండా శ్రమించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. కానీ చివిరికి వ్యవహారం చేయిదాటిపోయింది. మసీదును కూల్చేశారు. ఆ సమస్యను కూడా తీర్పు కోసం సుప్రీంకోర్టుకు అప్పగించారు. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ నరసింహారావుకే దక్కుతుంది. 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే.

పీవీలో గొప్ప సాహిత్యకారుడు

పీవీ నరసింహారావు 17 భాషల్లో పండితుడు. గోండుల భాష నుంచి స్పానిష్ వరకూ అనర్గళంగా మాట్లాడగలిగే దిట్ట. క్యూబా యోధుడు ఫిడేల్ క్యాస్ట్రోతో స్పానిష్‌లో మాట్లాడి ఆశ్చర్యపరిచారట. పీవీలో గొప్ప రచయిత సైతం దాగి ఉన్నారు. కథలు, వ్యాసాలు, అనువాద రచనలు అనేకం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంతో రాసిన ‘గొల్ల రామవ్వ’ రచన ఎంతో మంది సాహిత్యకారులను ఆకట్టుకుంది. ‘ఇన్ సైడర్’ పేరుతో పీవీ తన ఆత్మకథను ఆవిష్కరించారు. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో పీవీ హిందీలోకి తర్జుమా చేశారు.

ప్రధానిగా తీరిక లేకుండా ఉన్నా క్రమంత తప్పకుండా అవధాన కార్యక్రమాలకు హాజరవుతూ ఉండేవారు. అవధాన కార్యక్రమాల ద్వారా ఎంతో ప్రశాంతత లభిస్తుందని మిత్రుల వద్ద చెప్పేవారు. పీవీకి 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్నా ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవారు. అందుకే అయన మిత్రులు 17 భాషలు తెలిసిన మౌనముని అంటూ ఆటపట్టించేవారు.

పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు ‘పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే’ అని పేరు గౌరవించారు. ప్రస్తుతం పీవీ కుమార్తె వాణీదేవి తెలంగాణ శాసనమండలి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పీవీ మరణం తరువాత ఆయన పార్దీవ దేహం విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. పీవీ మరణానంతరం 2024లో ఎన్డీఏ ప్రభుత్వం భారత రత్నను ప్రకటించింది.

Follow Us