AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic day 2022: రిపబ్లిడ్‌ డే శకటాలను ఎలా రూపొందిస్తారు? అసలు పరేడ్‌లో పాల్గొనే శకటాల ప్రక్రియ ఎంపికలో విధి విధానాలేంటంటే..

గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ముస్తాబైంది . ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కరోనా (covid) ఆంక్షల మధ్యన అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు రాజ్ పథ్ (Rajpath) మైదానాన్ని సిద్ధం చేశారు.

Republic day 2022: రిపబ్లిడ్‌ డే శకటాలను ఎలా రూపొందిస్తారు? అసలు పరేడ్‌లో పాల్గొనే శకటాల ప్రక్రియ ఎంపికలో విధి విధానాలేంటంటే..
Basha Shek
|

Updated on: Jan 26, 2022 | 6:41 AM

Share

Repuplic day celebrations: గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ముస్తాబైంది . ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కరోనా (covid) ఆంక్షల మధ్యన అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు రాజ్ పథ్ (Rajpath) మైదానాన్ని సిద్ధం చేశారు. కాగా ఏటా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని  రాజ్‌పథ్‌ లో వివిధ శకటాల ప్రదర్శన ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది విషయానికొస్తే..  రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనే శకటాల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా సుమారు  21 శకటాలు పాల్గొనే సూచనలున్నాయి. ఇందులో 12 శకటాలు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి కాగా, మిగిలిన 9 శకటాలు, కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషిలో పనిచేసే  విభాగాలు లేదా స్వతంత్ర సంస్థలకు చెందినవి. అయితే ఈసారి శకటాల ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పశ్చిమ బెంగాల్‌కు చెందిన  శకటాన్ని ఈ ఏడాది రిపబ్లిక్‌ డే పరేడ్‌ నుంచి తిరస్కరించడమే దీనికి కారణం. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయం తనను ఎంతో షాక్‌కు గురిచేసిందంటూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి  ఏకంగా లేఖ రాశారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలు, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ ని గుర్తుచేస్తూ రూపొందించిన శకటాన్ని రిపబ్లిక్ డే పరేడ్ కు అనుమతించకపోవడం తమను కలిచి వేసిందంటూ దీదీ తన లేఖలో పేర్కొన్నారు.

రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే..

కాగా కేంద్ర రక్షణశాఖ తిరస్కరించిన శకటాల్లో  పశ్చిమ బెంగాల్‌  శకటంతో పాటు   శ్రీ నారాయణ గురును స్మరిస్తూ కేరళ ప్రభుత్వం  రూపొందించిన శకటం  తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన శకటాలున్నాయి. దీనిపై ఆయా రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ రక్షణ శాఖ మార్గదర్శకాల ప్రకారమే శకటాల ఎంపిక జరిగిందని చెప్పుకొచ్చారు. దీనిపై పశ్చిమబెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులకు ప్రత్యుత్తరాలు కూడా పంపారు.  ఈక్రమంలో  పరేడ్‌కు బాధ్యత వహించే రక్షణ మంత్రిత్వశాఖే శకటకాలను సమన్వయం చేస్తుందని, పరేడ్ లో పాల్గొనే శకటాల ఎంపికను నిపుణుల కమిటీ చూస్తుందని, ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని ఆయన లేఖలో పాల్గొన్నారు. మరి రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనే శకటాల ను ఎలా ఎంపిక చేస్తారు? వాటి వెనకనున్న ప్రక్రియేంటో తెలుసుకుందాం రండి.

ఈసారి 75 ఏళ్ల స్వాతంత్ర్యం థీమ్‌ తో..

గణతంత్ర వేడుకలకు బాధ్యత వహించే రక్షణ మంత్రిత్వ శాఖ.. ఏటా సెప్టెంబర్‌లో శకటాల ప్రదర్శనకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని రాజ్యాంగ సంస్థలకు లేఖలు రాస్తుంది. ఈ  ఏడాది కూడా సెప్టెంబర్‌ 16న 80 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎన్నికల సంఘం, నీతి ఆయోగ్‌కు లేఖలు రాసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ  పేర్కొంది.  పరేడ్ లో పాల్గొనే శకటాల  ప్రతిపాదనలను పంపించాలనే సూచన ఇందులో ఉంది. ఈ ప్రతిపాదనలను సెప్టెంబర్‌ 27లోపు సమర్పించాలి. వాటిని ఎంపిక చేసే ప్రక్రియ అక్టోబర్‌ రెండో వారంలో మొదలవుతుంది.  కాగా ఈ సంవత్సరం  75 ఏళ్ల భారత స్వాతంత్య్రం థీమ్ ను ఎంపిక చేసి శకటాల డిజైనింగ్ లో పాటించాల్సిన మార్గదర్శకాలను  రక్షణ మంత్రిత్వ శాఖ పంపిస్తుంది. పాల్గొనే సంస్థలు ప్రముఖ సంస్థలకు చెందిన అర్హులైన  డిజైనర్లను తీసుకోవాలి. అలాగే చిత్రాలు లేదా కంటెంట్‌ చక్కగా కనిపించేలా ఉండేందుకు ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే వాల్‌,  రోబొటిక్స్‌ లేదా మెకాట్రానిక్స్‌, కొన్నింటి కోసం 3D ప్రింటింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, శకటాన్ని చక్కగా చూపేందుకు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ వంటివి పాటించాలి. ఇక దేశ వైవిధ్యాన్ని  ప్రతిబింబించేలా శకటాలు ఉండాలి కాబట్టి ఏ రెండు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించిన శకటాలు ఒకే తరహాలో ఉండకూడదన్న నియమం ఉంది.

ఇక శకటాలపై ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు/విభాగాల పేర్లు తప్ప ఎటువంటి రాతలు, లోగోలు ఉండకూడదు. అంతే కాదు శకటాల పేర్లు ముందు భాగంలో హిందీలో, వెనుక భాగంలో ఇంగ్లిష్‌లో మిగిలిన వైపు ప్రాంతీయ భాషల్లో  ఉండాలి. శకటాల రూపకల్పనలో పర్యావరణ అనుకూల వస్తువులు ఉపయోగించాలని, ప్లాస్టిక్‌, ప్లాస్టిక్‌ ఆధారిత వస్తువులను వాడకూడదనే  సూచన కూడా అందులో  ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారంటే..

రిపబ్లిక్ డేలో పాల్గొనే శకటాల ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. అదేవిధంగా చాలా సమయం కూడా తీసుకుంటుంది. ఇందుకోసం కళలు, సంస్కృతి, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, ఆర్కిటెక్చర్‌, నాట్యం వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేస్తుంది. వచ్చిన ప్రతిపాదనల నుంచి శకటాలను ఎంపిక చేయడంలో వీరు సలహాలు, సూచనలు అందిస్తారు. శకటాల ప్రతిపాదనలకు సంబంధించిన స్కెచ్చులు లేదా డిజైన్లను ఈ కమిటీ పరిశీలిస్తుంది. వాటిల్లో ఏమైనా మార్పులు, చేర్పులు అవసరమైతే  సూచనలు చేస్తుంది. మామూలుగా, రంగులతో కూడా, చదవడానికి వీలుగా, అనవసరమైన వివరాలు లేకుండా స్కెచ్‌ ఉండాలి. అది చూడగానే అర్థమైపోవాలి తప్ప దానికి ఎటువంటి రాతపూర్వక వివరణ ఉండకూడదు.

పరిగణణలోకి తీసుకునే అంశాలివే..

శకటాల్లో సంప్రదాయ నృత్యం ఉంటే అది  జానపద నృత్యం అయి మాత్రమే ఉండాలి. ఉపయోగించే దుస్తులు, సంగీత వాయిద్య పరికరాలన్నీ కూడా సంప్రదాయకంగానే  ఉండాలి. ఆ నాట్యానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ కూడా ప్రతిపాదనలకు జత చేయాలి. వీటికి అనుమతి లభించాక తమ ప్రతిపాదనలకు సంంబంధించి 3D మోడల్స్‌  కూడా అందజేయాల్సి ఉంటుంది . తుది ఎంపిక సందర్భంగా వాటిని కూడా నిపుణుల కమిటీ  పరిశీలిస్తుంది.  శకటం కనిపించే తీరు, జనాలపై చూపే ప్రభావం, శకటం ఆకృతి, అందులో ఇమిడి ఉండే అంశం, సంగీతం వంటి అనేక అంశాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది.

థీమ్‌కు అనుగుణంగా..

ఇక ప్రతిపాదనల పరిశీలన, తొలగింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు  నిపుణుల కమిటీ కనీసం ఆరుసార్లు సమావేశమవుతుంది.  ఇక షార్ట్‌ లిస్ట్‌ అయిన వాటికి  మాత్రమే తదుపరి రౌండుకు సంబంధించిన సమాచారం అందిస్తారు. తుది ఎంపిక జరిగినప్పటికీ ఆమోదించిన తుది ప్రకటనలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా శకటం లేనట్టయితే  రాజ్‌పథ్‌లో నిర్వహించే పరేడ్‌లో ఆ శకటానికి స్థానం కల్పించరు.  రిపబ్లిక్ డేలో  పాల్గొనే వారికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ట్రాక్టర్‌, ఒక ట్రాయిలర్ అందిస్తుంది. వాటిపైనే శకటం ఏర్పాటుచేయాలి. అదనంగా ఎటువంటి ట్రాక్టర్‌ లేదా ట్రాయిలర్‌ లేదా ఇతర ఏ వాహనాన్ని కూడా  రక్షణ మంత్రిత్వ శాఖ  అనుమతించదు. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ అందించే ట్రాక్టర్‌ లేదా ట్రైలర్‌ను పాల్గొనేవారు మార్చుకోవచ్చు. అయితే వాహనాల సంఖ్య రెండుకు మించరాదు. శకటం థీమ్‌కు అనుగుణంగా ట్రాక్టర్‌ను అలంకరించాల్సి ఉంటుంది. అలాగే నడపడానికి, తిప్పడానికి వీలుగా ట్రాక్టరుకు, ట్రాయిలర్‌కు మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలి. ఇక పరేడ్ లో పాల్గొనేవారు తమ థీమ్‌కు తగినట్టుగా శకటానికి మెరుగులు దిద్దుకోవచ్చు. శకటాన్ని నిలిపి ఉంటే ట్రైలర్‌ 24 అడుగుల 8 ఇంచుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 4.2 ఇంచుల ఎత్తుతో 10 టన్నుల బరువు మోయగలిగే సామర్థ్యంతో ఉండాలి. అలాగే శకటం పొడవు 45 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, నేల నుంచి 16 అడుగుల ఎత్తు మించరాదు.

Also read: Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Viral Video: డ్యాన్స్‌తో అదరగొట్టిన వధువు !! చివర్లో వరుడికి బిగ్ సర్‌ప్రైజ్ !! వీడియో

Dead Person Fingerprint: ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు మరణించిన వ్యక్తి ఫింగర్‌ ప్రింట్‌ ఎందుకు పని చేయవు.. వేలిముద్రలను ఎలా గుర్తిస్తారు..?