మణిపూర్లో పర్యటించనున్న ప్రధాని మోదీ! తేదీ, పూర్తి షెడ్యూల్ ఇదే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరం, మణిపూర్లలో పర్యటించనున్నారు. మిజోరంలో 51.38 కి.మీల బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ను ప్రారంభించనున్నారు. ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగం. మణిపూర్ సందర్శన ధ్రువీకరించబడలేదు. SCO సమావేశంలో మోదీ ఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగా బలమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరం, మణిపూర్లను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మణిపూర్కు వెళ్లే ముందు మిజోరంలో 51.38 కిలో మీటర్ల కొత్త బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ను ప్రారంభించనున్నారు. మిజోరం ప్రధాన కార్యదర్శి ఖిల్లీ రామ్ మీనా సోమవారం పలు విభాగాలు, చట్ట అమలు సంస్థలతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించి ప్రధాని మోదీ పర్యటన సంసిద్ధతను సమీక్షించారు. “భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణపై సమావేశంలో చర్చించారు” అని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఐజ్వాల్లోని లమ్మౌల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు కూడా పాల్గొనున్నారు.
ప్రాజెక్ట్, యాక్ట్ ఈస్ట్ పాలసీ
ఐజ్వాల్ను అస్సాంలోని సిల్చార్ పట్టణంతో కలిపే బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ కేంద్రం యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగం. ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, ఈశాన్య ప్రాంతం అంతటా ఆర్థిక ఏకీకరణను పెంచుతుందని భావిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి తన ఐజ్వాల్ కార్యక్రమం తర్వాత మణిపూర్కు విమానంలో వెళ్తారని మిజోరం అధికారులు చెబుతున్నప్పటికీ, ఇంఫాల్లోని అధికారులు ఆయన సందర్శనను ధృవీకరించలేదు. ఒక వేళ మే 2023లో జాతి హింస చెలరేగిన తర్వాత మోడీ మణిపూర్లో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది.
కాగా సోమవారం చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సభ్యుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన సందేశం ఇచ్చారు, ఉగ్రవాదాన్ని, దాని నిధులను భారతదేశం నిరంతరం వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగా భారతదేశం స్వరం పెంచింది అని ఆయన అన్నారు, ఈ అంశంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరు కావడంతో, మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాద ముప్పుకు వ్యతిరేకంగా సభ్య దేశాలు సమిష్టిగా చర్య తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




