AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DK Shivakumar: కర్ణాటక సీఎం మార్పు వెనక కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. సీఎంగా డీకేనే ఎందుకు..? అసలు లెక్కలు ఇవీ..

రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదు.. ప్రతి అడుగు వెనుక ఒక పక్కా వ్యూహం ఉంటుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా పరిణామం సరిగ్గా ఇలాంటిదే. మూడేళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించిన సిద్ధరామయ్య, ఇప్పుడు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ కోసం పగ్గాలు వదిలేశారు. ఈ అధికార మార్పిడి వెనకున్న పొలిటికల్ లెక్కలేంటీ అనేది తెలుసుకుందాం..

DK Shivakumar: కర్ణాటక సీఎం మార్పు వెనక కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. సీఎంగా డీకేనే ఎందుకు..? అసలు లెక్కలు ఇవీ..
Why Dk Shivakumar Is Becoming The New Cm
Krishna S
|

Updated on: May 28, 2026 | 3:59 PM

Share

కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు ఒక శకం ముగిసి, మరో శకం ప్రారంభంకాబోతుంది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి సర్వం సిద్ధమైంది. అయితే సిద్ధరామయ్య వంటి బలమైన మాస్ లీడర్‌ను మార్చడం వెనుక.. కేవలం ఢిల్లీ అధిష్టానం ఒత్తిడి మాత్రమే లేదు. దీని వెనుక 2023 నాటి ఒక రహస్య ఒప్పందం, పార్టీ సంస్థాగత బలాలు, రాబోయే 2028 ఎన్నికల వ్యూహాలు దాగున్నాయి. ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు పునాది మూడేళ్ల క్రితమే పడింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించినప్పుడు.. ముఖ్యమంత్రి కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నడిచింది. ఆ సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరు నేతలను ఢిల్లీకి పిలిపించి ఒక రహస్య రాజీ ఫార్ములాను కుదిర్చింది. ఆ ఒప్పందం ప్రకారం.. ఐదేళ్ల కాలపరిమితిలో మొదటి సగం కాలం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత మిగిలిన కాలానికి డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో సిద్ధరామయ్య చేత హైకమాండ్ రాజీనామా చేయించింది. సిద్ధరామయ్య గౌరవాన్ని కాపాడేందుకు గానూ ఆయనకు పార్టీలో కీలక పాత్రతో పాటు రాజ్యసభ సీటును కూడా అధిష్టానం ఆఫర్ చేసింది.

కష్టానికి దక్కిన ఫలితం

డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కడం వెనుక ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలమే ప్రధాన కారణం. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. కుప్పకూలిన కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుండి పునర్నిర్మించారు. కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాలకు, పార్టీ అవసరాలకు తన ట్రబుల్ షూటర్ ఇమేజ్‌తో నిధులు సమకూర్చి, విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ కష్టకాలంలో కొండంత అండగా నిలిచినందుకే హైకమాండ్ ఆయనకు ఈ అత్యున్నత పదవిని బహుమతిగా ఇస్తోంది.

కుల సమీకరణాలు.. వొక్కలిగ ఓటు బ్యాంక్ ప్లాన్

కర్ణాటక రాజకీయాలను శాసించేది కుల సమీకరణాలే. సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేత కాగా, డీకే శివకుమార్ కర్ణాటకలో అత్యంత ఆధిపత్యం, ప్రాబల్యం ఉన్న వొక్కలిగ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు. పాత మైసూర్ ప్రాంతంలో వొక్కలిగ సామాజిక వర్గం ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం కర్ణాటకలో ఆనవాయితీ. ఇప్పుడు డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవిని ఇవ్వడం ద్వారా రాబోయే ఎన్నికల కంటే ముందే వొక్కలిగ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు పూర్తిగా తిప్పుకోవచ్చని అధిష్టానం భావిస్తోంది. దీనివల్ల అటు ఓబీసీ, ఇటు వొక్కలిగ వర్గాల సమతుల్యత దెబ్బతినకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడింది.

2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్

కాంగ్రెస్ హైకమాండ్ కేవలం ఈరోజు గురించే కాకుండా రాబోయే 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయానికి ఒకే ముఖంతో వెళ్లకుండా, డీకే శివకుమార్ రూపంలో ఒక డైనమిక్, కొత్త ముఖాన్ని రాష్ట్రానికి నాయకుడిగా నిలబెట్టడం. డీకే శివకుమార్‌కు మాస్ ఫాలోయింగ్‌తో పాటు కేడర్‌ను నడిపించే సత్తా ఉంది. ఆయన సీఎం అయితే పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుందని హైకమాండ్ నమ్ముతోంది. అంతర్గత విభేదాలకు తావులేకుండా పార్టీ వర్గాలను ఏకీకృతం చేయడానికి, రాబోయే ఎన్నికల్లో మళ్లీ జెండా పాతడానికి ఈ పరివర్తనను ఒక వ్యూహాత్మక పునఃప్రారంభంగా కాంగ్రెస్ భావిస్తోంది.

మొత్తానికి సిద్ధరామయ్య రాజీనామా వెనుక కేవలం అధికార మార్పిడి మాత్రమే లేదు.. కర్ణాటకలో కాంగ్రెస్ సుదీర్ఘకాలం అధికారంలో ఉండేందుకు వేసిన ఒక పక్కా మాస్టర్ ప్లాన్ ఉంది. కుల సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ సంస్థాగత లీడర్‌కు పట్టం కడుతూ, 2028 ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే సమరశంఖం పూరించిందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Follow Us