మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల ఎదురు చూపులు!
మధ్య పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. తొలకరి వర్షాలను నమ్ముకుని పత్తి, కంది వంటి పంటల విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తకపోవడంతో పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు, ఎల్నినో ప్రభావం 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని ఇన్కోయిస్ తాజా బులెటిన్లో పేర్కొనడంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులు వ్యవసాయం, సముద్ర వాతావరణ వ్యవస్థలు, మత్స్య సంపదపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

El Nino Effect, Monsoon Deficit, Rainfall Shortage, Farmers Concern, Kharif Season, INCOIS Bulletin, El Nino 2027, Southwest Monsoon, Agriculture Crisis, Crop Sowing, Rain Delay, Sea Surface Temperature, Indian Ocean Climate, Weather Forecast, Farming Losses, Telangana, rains, TG rains
El Nino Effect May Disrupt Agriculture and Ocean Conditions Through 2027
హైదరాబద్, జూన్ 25: మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల వానాకాలంలో వానల జాడ కానరావడం లేదు. మృగశిర కార్తె ముగిసి ఆరుద్ర కార్తె ప్రవేశించినా ఆకాశంలో కారు మబ్బులు కనిపించడం లేవు. ఇటీవల కురిసిన తొలకరి వర్షంతో పులకరించిన రైతన్న వానకాలం సాగుకు సిద్ధం చేసిన పొలాల్లో పత్తి, కంది వంటి పంటల విత్తనాలు తొందరపడి భూమిలో విత్తారు. అయితే భూమిలో విత్తనాలు విత్తిన తర్వాత వాన దేవుడు ముఖం చాటేశాడు. దీంతో రైతన్నలు వర్షం కోసం ప్రతిరోజూ ఆకాశం వైపు చూసున్నా వరుణ దేవుడు మాత్రం కనిపించడం లేదు. దీంతో రైతన్న కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినా సీజన్ ఆరంభంలోనే తీవ్ర వర్షపాత లోటు ఏర్పడింది. మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల రైతులు ఆందోళన చెం దుతున్నారు.
ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని తొలకరి వర్షానికి రైతులు ఎవరూ పంటలు సాగు చేయవద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచించినప్పటికీ రైతులు తొందరపడి అక్కడక్కడ పావుల వంతు భూమిలో విత్తనాలు విత్తారు. విత్తనాలు విత్తని రైతులు అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. విత్తిన రైతులు సాగు కోసం ఖర్చు చేసిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరేనా అని కుమిలిపోతున్నారు.
ఈ 8 నెలలు ఎంతో కీలకం.. హెచ్చరికలు జారీ
మరోవైపు ఎల్నినో ప్రభావం 2027 వరకు కొనసాగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కోయిస్) ఎల్ నినోపై తాజాగా బులెటిన్ విడుదల చేసింది. ఇందులో 2026 జూన్ నుంచి 2027 ఫిబ్రవరి ఎల్నినో ప్రభావం కొనసాగుతుందని అంచనా వేశారు. ఈ అవకాశం 70 నుంచి 90 శాతం మధ్య ఉందని, ఆ సంస్థ తెలిపింది. సముద్రంలోవాతావరణ పరిస్థితుల్లో మార్పులు అంత వేగంగా రానప్పటికీ 2027 రుతుపవన కాలం కూడా దీని వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం పరిణామాల దృష్ట్యా చాలా వరకు ఇది జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా 2026 జూన్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు ఉండే కాలంలో ఎల్ నినో అనేది ఈఎన్ఎస్వో దశగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎల్నినో వల్ల ఉత్తర హిందూ మహాసముద్రం అంతటా సముద్ర పరిస్థితులు ప్రభావితం కానున్నాయి. దీని ఫలితంగా అధిక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్ర ఉపరితల భాగంలో ఉష్ణ పరిమాణం పెరగడం, సముద్ర వడగాడ్పులు పెరగడం వంటివి సంభవిస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని సముద్ర వాతావరణ వ్యవస్థలు, మత్స్య సంపద, తీరప్రాంత పర్యావరణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.




