లోదుస్తుల్లో సిమ్ కార్డు, పాత ప్రశ్నపత్రం.. NEET రీ-ఎగ్జామ్లో 10 మంది నకిలీగాళ్ల అరెస్ట్!
దేశవ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించిన నీట్ 2026 రీటెస్ట్లో పలు అక్రమాల ఘటనలు వెలుగుచూశాయి. ఓ అభ్యర్థి లోదుస్తుల్లో సిమ్ కార్డు, పాత ప్రశ్నపత్రం దాచుకుని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో పరీక్ష కేంద్రంలో నమోదిత అభ్యర్థుల స్థానంలో నకిలీ అభ్యర్థులుగా పరీక్ష రాయడానికి ప్రయత్నించిన తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలతో నీట్ పరీక్షల్లో అక్రమాల ముఠాల కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరమైంది..

హైదరాబాద్, జూన్ 22: దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ 2026 రీటెస్ట్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 20.79 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడా ప్రశ్నాపత్రం లీకైన ఆరోపణలు ఇప్పటి వరకు రాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. అయితే ఎంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష నిర్వహించినప్పటికీ కొందరు విద్యార్ధులు అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడ్డారు.
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఒక అభ్యర్థి తన లోదుస్తుల్లో సిమ్ కార్డు, అలాగే నీట్ పాత ప్రశ్నపత్రాన్ని దాచిపెట్టి పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది తనికీల్లో విద్యార్ధి గుట్టు బయటపడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారణాసిలోని హరిశ్చంద్ర పోస్ట్గ్రాడ్యుయేట్ కాలేజీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పరీక్ష సెంటర్కు వచ్చిన ఓ అభ్యర్థి ప్రవర్తనపై భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. లోదుస్తుల్లో దాచిన ఎలక్ట్రానిక్ పరికరాలు, పాత పేపర్, జిగురు పదార్ధం బయటపడ్డాయి. పట్టుబడిన విద్యార్ధి పేరు ప్రిన్స్ దూబేగా గుర్తించారు. అతడు ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాకు చెందిన వాడినని దర్యాప్తులో తేలింది. నీట్ కోసం తాను మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో ట్రైనింగ్ తీసుకున్నాననీ, కేవలం పరీక్ష రాయడం కోసమే వారణాసికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. పోలీసులు అతని దగ్గర ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
నీట్ పరీక్షకు నకిలీ అభ్యర్ధులు.. 9 మంది అరెస్ట్
నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ సందర్భంగా నమోదిత అభ్యర్థుల స్థానంలో నకిలీ అభ్యర్థులుగా పరీక్ష రాసేందుకు యత్నించిన ఆరోపణలతో బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో ఆదివారం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలైన అభ్యర్థుల స్థానంలో నకిలీ అభ్యర్ధులు పరీక్ష రాసేందుకు ప్రతయ్నించినట్లు లఖిసరాయ్ ఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధిత పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్ల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదులు అందిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ రాకెట్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బయోమెట్రిక్ ఆపరేటర్లు, మధ్యవర్తులతో సహా మరో 10 నుంచి 12 మందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి గుర్తింపు వివరాలను ఇంకా వెల్లడించలేదు. ప్రాథమిక విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. అలాగే నీట్ పేపర్ లీక్, నకిలీ ప్రశ్నపత్రాల విక్రయాలకు యత్నించిన ఆపరేషన్లలో కొంతమంది సైబర్ నేరగాళ్లు, దళారులను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో మాఫియా నెట్వర్క్ గుట్టును ఈ మేరకు పోలీసులు బట్టబయలు చేశారు.




